Seniority Violation: రూల్ ఆఫ్ రిజర్వేషన్కు ఆర్అండ్బీ పాతర
ABN , Publish Date - May 10 , 2025 | 05:07 AM
ఆర్అండ్బీ శాఖలో దళిత, గిరిజన అధికారులకు అన్యాయం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సీనియారిటీ జాబితాలో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేకపోయినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఈఈ, ఎస్ఈల సీనియారిటీలో గోల్మాల్
ఎస్సీ, ఎస్టీ అధికారులకు అన్యాయం
కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ తుంగలోకి
హైకోర్టుకు ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధం
దళిత, గిరిజన అధికారుల ఆవేదన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రోడ్లు, భవనాల శాఖలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(ఈఈ), సూపరింటెండెంట్ ఇంజనీర్(ఎస్ఈ)ల సీనియారిటీ జాబితాలో దళితులు, గిరిజన అధికారులకు అన్యాయం జరిగింది. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు పాతర వేసి కేవలం ఓ రెండు వర్గాలకు చెందినవారిని శరవేగంగా అందలం ఎక్కించేలా, వారే సీఈ, ఈఎన్సీ కావాలనే ఉద్దేశంతో జాబితా రూపొందించారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఇంజనీర్ల సీనియారిటీ ఖరారు చేస్తూ, ఈఈ, ఎస్ఈల తుది సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తూ శుక్రవారం ఆర్అండ్బీ శాఖ ఉత్తర్వులు(జీఓ 22, 23) జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85ను ఉల్లంఘిస్తూ కేవలం కొన్ని వర్గాల అధికారులకు ప్రయోజనం కలిగించేలా సీనియారిటీ జాబితా తయారు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నాడు చంద్రబాబు హయాంలోనే..
దళిత, గిరిజనులకు ఉద్యోగ నియామకాలు, ఆ తర్వాత సర్వీసు పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2001లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 85ని సవరించింది. పదోన్నతుల్లో అణగారిన వర్గాలకు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని అమలు చేయాలని రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది దేశవ్యాప్తంగా 1995 నుంచే వర్తిస్తుందని స్పష్టం చేసింది. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2002లో దీనికి అనుగుణంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. దళిత, గిరిజన వర్గాలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. 2003 ఏప్రిల్ 14న దాన్ని అమల్లోకి తీసుకొస్తూ జీఓ 5ను జారీ చేశారు. ఈ ఉత్తర్వు దేశంలోనే సంచలనం సృష్టించింది. దళిత, గిరిజన వర్గాలకు మేలు చేసిన తొలిరాష్ట్రంగా ఏపీకి పేరు వచ్చింది. చంద్రబాబు నిర్ణయం వల్ల వేలాది మంది అణగారిన వర్గాల ఉద్యోగులకు పదోన్నతుల్లో మేలు జరుగుతోంది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆర్అండ్బీలో దళిత, గిరిజన అధికారులకు అన్యాయం జరుగుతోంది. వారి చట్టబద్ధమైన ప్రయోజనాలను బుట్టదాఖలు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీలను తొక్కి పెట్టి ఈఈ, ఎస్ఈల సీనియారిటీని ఖరారు చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు అందుకొని సీనియారిటీలో ముందు వరసలో ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ అధికారులను ఎక్కడో చివర చేర్చారు. మరో రెండు వర్గాల అధికారులను జాబితాలో టాప్లోకి తీసుకొచ్చి పట్టంకట్టారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఖరారు చేసిన తుది సీనియారిటీలో తమకు దక్కాల్సిన పదోన్నతులను ఇతర వర్గాల వారికి ఇచ్చారని బాధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
హైకోర్టుకు హామీ ఇచ్చినా...
గత ప్రభుత్వంలో ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబు ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అధికారులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్తో పాటు ఆర్టికల్ 85 ప్రకారం కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని వర్తింప చేస్తామని 10128 కేసులో హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్కుమార్ ప్రసాద్ నేతృత్వాన సీనియర్ ఐఏఎస్లతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్ఓఆర్తో పాటు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని అమలు చేయాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ఈ విధానం అమలు చేస్తామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే సంవత్సరం వారీగా ప్యానల్స్ తయారు చేశారు. సామాజిక న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు జీఓల్లో ఆ సామాజిక న్యాయం కనిపించకుండా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్అండ్బీ కార్యదర్శిగా దళిత అధికారి ఉన్నా తమకు న్యాయం చేయలేకపోయారని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ గోల్మాల్ను ముఖ్యమంత్రి చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లేందుకు దళిత, గిరిజన ఉద్యోగులు, అధికారులతో పాటు సంఘాలు రెడీ అవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New