Police Raid : సంక్రాంతి వెళ్లినా.. ఆగని కోడి పందేలు!
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:28 AM
సెల్ఫోన్ సందేశాల ఆధారంగా వారానికో ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు, కామరపుకోట, చింతలపూడి...
‘తూర్పు’లోని పుల్లలపాడు అడవిలో జోరుగా జూదం
పలు జిల్లాల నుంచి రాక.. లక్షల్లో పందేలు
పోలీసుల మెరుపు దాడి.. 32 మంది అరెస్టు
6.02 లక్షల నగదు, 7 కార్లు స్వాధీనం
నల్లజర్ల, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ వెళ్లినా.. కోడి పందేల జోరు తగ్గలేదు. సెల్ఫోన్ సందేశాల ఆధారంగా వారానికో ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు, కామరపుకోట, చింతలపూడి మండలాలకు చెందిన వ్యక్తులు వారాంతంలో పందేలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఫ్లడ్లైట్ల వెలుగులో మారుమూల ప్రాంతాల్లో రూ.లక్షల్లో పందేలు సాగుతున్నాయి. ఇదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు అటవీ ప్రాంతంలో పందేలు సాగుతున్న ప్రాంతంపై పోలీసులు గురువారం తెల్లవారుజామున దాడి చేశారు. నల్లజర్ల సీఐ విజయశంకర్ ఆధ్వర్యంలో మెరుపుదాడి చేసి 32 మంది పందేల రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 6,02,110 నగదు, 28 సెల్ఫోన్లు, 7 కార్లు, ఒక బైక్, 2 పుంజులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో కడప, కర్నూలు, ఏలూరు, కాకినాడ, భీమవరం ప్రాంతాల వారు ఉన్నారు. వారిని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.