Project Resumption : పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం
ABN , Publish Date - Jan 18 , 2025 | 03:57 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం తర్వాత పోలవరం ప్రాజెక్టు జంట సొరంగాల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.

పోలవరం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం తర్వాత పోలవరం ప్రాజెక్టు జంట సొరంగాల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం నాటికి ఈ పనులను అధికారులు ముమ్మురం చేశారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ కనెక్టివిటీ కోసం కొండను తొలిచి జంట సొరంగాలను నిర్మించారు. జంట సొరంగాల లైనింగ్, ఇతర పనులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ఆ పనులను అధికారులు తిరిగి ప్రారంభించారు. తోటగొంది, మామిడిగొంది గ్రామాల మధ్య జంట సొరంగాల విస్తరణ పనుల్లో భాగంగా ఊట జలాలను తొలగించారు. దీనికి సమీపంలో మామిడిగొంది, దేవరగొంది గ్రామాల మధ్య నిర్మించిన జంట సొరంగాల్లో ఊట జలాలను తొలగించి మట్టి తరలింపు పనులు చేపట్టారు. గుహల విస్తరణకు అవసరమైన యంత్ర సామగ్రి ఆ ప్రాంతానికి చేర్చి విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు వేగవంతం చేశామని ఈఈ బాలకృష్ణ చెప్పారు. విస్తరణ పనులలో భాగంగా ఎగ్జిట్ చానల్ మట్టి తరలింపు వేగంగా జరుగుతుందని, అనంతరం లైనింగ్ పనులు కూడా వేగవంతం చేస్తామన్నారు.