Montha Cyclone: హెచ్చరిక.. ఈ రాత్రి గంటకి వంద కి.మీ వేగంతో గాలులు!
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:32 AM
ఏపీలో మొంథా తుఫాన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో వంద కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో భారీ వర్షం కురుస్తుందని చెబుతున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని..
మచిలీపట్నం, అక్టోబర్ 28: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తుఫాన్ కారణంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఈ ఉదయం పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని తీర ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.
తుఫాను ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉండటంతో వంద కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో భారీ వర్షం కురుస్తుందని అటు, వాతావరణ శాఖ కూడా అప్రమత్తం చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ' అధికారులు, ప్రజాప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజలకు తగిన సూచనలు ఇస్తున్నారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. గతంలో ఎవరూ చేయని విధంగా బియ్యంతో పాటు ప్రజలకు 3000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ సిఎంఓ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావతి ప్రాంతాలను పరిశీలిస్తూ అక్కడి నుంచే ఆయా జిల్లాలకు సూచనలు చేస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజలు కూడా తప్పనిసరి అయితేనే బయటికి రండి. రెండు రోజులు ఈ భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నిర్లక్ష్యంతో ఉండి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దు. పురాతన ఇళ్లు, చెట్లు కింద ఉండకండి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి. కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇచ్చినా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారు.' అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలకు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News