స్వచ్ఛ శ్రీశైలం
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:15 AM
Swaccha Srisailam program in Nandyal district

శ్రీశైలం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానంలో గురువారం స్వచ్ఛసేవా కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది. కార్యక్రమంలో ప్రధాన ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపము వద్ద నుంచి నందిగుడి వరకు ‘‘స్వచ్ఛశ్రీశైలం’’ పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణకై క్షేత్రపరిధిని 6 జోన్లు, 66 ప్రదేశాలుగా విభజించి, ప్రతి జోను పర్యవేక్షణకై దేవస్థానం యూనిట్ అధికారులు, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల సిబ్బంది, శివసేవకులు, స్థానికులను భాగస్వామ్యులను చేశారు. ఆలయ ప్రధాన రహదారులు, ఆలయ మాఢవీధులు, క్యూకాంప్లెక్స్, అన్నదానం, వసతి భవనాలు, పార్కింగ్ ప్రదేశాలు, పాతాళగంగ ఘాట్, ఆరోగ్యకేంద్రాలు, సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం ఆలయ ప్రాంగణం, తదితర 66 ప్రదేశాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.