Deputy CM Pawan: ప్రజా తీర్పుకు ఏడాది.. పవన్ భావోద్వేగం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:27 PM
Deputy CM Pawan Kalyan: ఏపీ ఎన్నికలు జరిగి ఎన్డీఏ కూటమి విజయఢంకా మోగించి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు.
అమరావతి, జూన్ 4: ఏపీ ఎన్నికల ఫలితాలు (AP Election Results) వచ్చి నేటికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజని, అరాచక పాలనపై ప్రజల తీర్పు చారిత్రాత్మకమని అన్నారు. ‘ప్రజా తీర్పుకు ఏడాది. ప్రజా చైతన్యానికి ఏడాది. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది. జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది’ అంటూ ట్వీట్ చేశారు.
ఈరోజు భారత దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. ఐదేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలు కొట్టారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజన్నారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత ప్రధాని మోదీ నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలిచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు అంటూ పేర్కొన్నారు.
‘మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం, గత తప్పిదాలను సరిచేస్తూ, భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
కూకట్పల్లి డ్రగ్స్ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు
వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్
Read Latest AP News And Telugu News