AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. సీఎం అంగీకారం
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:29 PM
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అమరావతి, నవంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సచివాలయంలో కీలక సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందు నుంచి చెబుతున్నట్టుగా మార్కాపురం, మదనపల్లి జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు అంగీకరించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించిన అనంతరం మార్పులు చేర్పులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు.
అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయించారు. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా.. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఓకే చెప్పారు. ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఈ సాయంత్రం ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి...
ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే
రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్
Read Latest AP News And Telugu News