AP High Court : పెద్దిరెడ్డి అటవీ భూములపై చట్ట నిబంధనలు పాటించండి
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:28 AM
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయ న కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అధికారులకు హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయ న కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న అటవీ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూముల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తే చట్ట నిబంధనలు అనుసరించాలని రెవెన్యూ, అటవీశాఖ అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి, చిత్తూరు జిల్లా కలెక్టర్, పులిచర్ల తహసీల్దార్కు నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. ఈ మేర కు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. చిత్తూరుజిల్లా, పులిచర్ల మండలం, మంగళంపేట గ్రామ పరిధిలోని వివిధ సర్వేనెంబర్లలో ఉన్న సుమారు 75.74 ఎకరాల భూమి పెద్దిరెడ్డి కుటుంబం అధీనంలో ఉంది. అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలని కోరుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.