MP Shabari: శవాల మీద రాజకీయం చేస్తున్న వైసీపీ: ఎంపీ శబరి
ABN , Publish Date - Oct 26 , 2025 | 08:09 PM
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ ఎంపీ శబరి మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 26: కర్నూలు బస్ ప్రమాద ఘటనపై వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మండిపడ్డారు. ఆదివారం అమరావతిలో ఎంపీ శబరి విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటనపై అందరూ బాధలో ఉంటే.. వైసీపీ, సాక్షి మీడియా మాత్రం శవాల మీద రాజకీయం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాల మీద వాలే రాబందుల మాదిరిగా వైసీపీ, సాక్షి మీడియా వ్యవహరిస్తోందని విమర్శించారు. సత్యమే జయతే అనే పేరు పెట్టుకుని అసత్య కథనాలు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు.
కల్తీ మద్యం తాగిన బైకర్ వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ అసత్య కథనాలు పుట్టించారని సదరు మీడియా ఛానల్పై ఆమె నిప్పులు చెరిగారు. మహిళ అయిన వైఎస్ భారతీ నడుపుతున్న సాక్షి మీడియాలో అవాస్తవాలే వస్తున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశ్యంతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. గతంలో అలా చేయడం వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఇంకా ఇలాగే అసత్య ప్రచారాలు కొనసాగిస్తే.. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఎంపీ శబరి జోస్యం చెప్పారు.
లైసెన్స్డ్ వైన్ షాప్ నుంచి బైకర్ మద్యం కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని ఎంపీ వివరించారు. ఇంకా బస్సు ప్రమాద ఘటన బాధ నుంచి తేరుకోక ముందే శవ రాజకీయాలు చేయడం ఎందుకు..? అని వైసీపీతోపాటు ఆ పార్టీ అనుబంధ మీడియాను ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి బాధాకర సంఘటనల నుంచి కూడా రాజకీయం చేసే స్థాయికి జగన్తోపాటు ఆయన కుటుంబం సైతం దిగజారిపోయిందన్నారు. విలువ ల్లేని రాజకీయం చేయడం సరికాదంటూ ఆ పార్టీ నేతలకు ఎంపీ బైరెడ్డి శబరి హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హనుమకొండలో వీధి కుక్కల బీభత్సం.. చిన్నారులకు తీవ్రగాయాలు
మొంథా తుపాను నేపథ్యంలో స్కూల్స్ బంద్
For More AP News And Telugu News