Chandrababu Naidu: విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తా: సీఎం వార్నింగ్
ABN , Publish Date - Dec 17 , 2025 | 09:42 PM
జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి, డిసెంబర్ 17: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం బుధవారం రాజధాని అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖపై జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏం జరిగినా.. ముందు సస్పెండ్ చేస్తానంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారు.
సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఒక క్యాలెండర్ రూపోందించాలని సూచించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజలు సంతృప్తి చెందాలని స్పష్టం చేశారు. పార్వతిపురం మన్యం జిల్లాలో జరుగుతోన్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయండని వారిని ఆదేశించారు.
హాస్టళ్లలో విద్యార్ధులకు ఏం జరిగినా ముందు సస్పెండ్ చేస్తాను... ఆ తర్వాత మాట్లాడతానని సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. సంక్షేమ హాస్టళ్లలో నిద్రచేయాలంటూ జిల్లా కలెక్టర్లకు సూచించారు. విద్యార్ధులందరికీ హెల్త్ చెకప్ చేయండి. రక్త హీనత సహా వేర్వేరు ఇబ్బందులు గుర్తించాలని పేర్కొన్నారు. 7,8,9,10, ఇంటర్ విద్యార్ధులకు వారిలో ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా యోగా, ధ్యానం వంటి వాటిని అమలు చేయండని సూచించారు.
పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరిగా చేసి.. రోజూ వారిగా వారిని ఆడించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజన విద్యార్ధులు ఐఐటీ, ఎన్ఐటీలకు ఎంపికయ్యారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు సీఎం గుర్తు చేశారు. సంక్షేమ శాఖల ద్వారా వెనుకబడిన విద్యార్ధుల కెరీర్ ప్లానింగ్ చేస్తే విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని వివరించారు. ఏజెన్సీలోని ఆర్గానిక్ ఉత్పత్తులను ఫుడ్ పార్కు ద్వారా ప్రాసెసింగ్ చేసి ఇతర మార్కెట్లకు తరలించేలా చూడాలన్నారు.
గిరిజన కార్పోరేషన్ ద్వారా కొన్ని హోటళ్లు కట్టి.. వాటి మెయింటెనెన్సును కార్పోరేట్లకు ఇస్తే పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రకృతితో మమేకం కావడానికి గిరిజన సంప్రదాయాలను చూసేందుకు పర్యాటకం పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. బ్రాహ్మణ కార్పోరేషన్లోనూ మంచి ప్రయోగం చేశారు. ప్రభుత్వ నిధులతో పాటు కమ్యూనిటీ నిధులతో ఆదుకునే ప్రయత్నం చేశారని వివరించారు.
ఫార్మర్స్ ప్రోడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరగాలని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ కోసం 250 ఎకరాలను కేటాయిస్తాం... ఇది ఫుడ్ పార్కుగా అభివృద్ధి కావాలని ఆ జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. పీ4 కింద సంక్షేమ హాస్టళ్లను ఆడాప్ట్ చేసుకునే అంశాన్ని పరిశీలించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్లతో తొలి రోజు సమావేశం ముగిసింది.