AP Liquor Scam: బాలాజీ గోవిందప్ప విన్నపం.. స్పందించిన ఏసీబీ కోర్టు
ABN , Publish Date - May 28 , 2025 | 02:25 PM
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వారిలో బాలాజీ గోవిందప్ప ఒక్కరు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారిని సిట్ విచారణకు అప్పగించడంపై మే 29వ తేదీన తీర్పు వెలువరిస్తామని ఇప్పటికే ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
విజయవాడ, మే 28: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బాలాజీ గోవిందప్ప.. తనకు జైలులో సౌకర్యాలు కల్పించాలంటూ ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఆయన విన్నపంపై ఏసీబీ కోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఆ క్రమంలో వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టు పరిశీలించింది. అనంతరం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇనుప మంచం, ఫోమ్ బెడ్, కుషన్ పిల్లోతోపాటు కుర్చీని గోవిందప్పకు ఆయన కుటుంబ సభ్యులు జైలులో అందజేశారు. అయితే వయస్సు రీత్య తాను అనారోగ్యంతో ఉన్నానని.. ఈ నేపథ్యంలో ఫోమ్ బెడ్, కుషన్ పిల్లో, కుర్చీ ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలంటూ కోర్టుకు ఆయన విన్నవించిన విషయం విదితమే.
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో ముద్దాయిల కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అందుకు సంబంధించిన తీర్పును మే 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. మద్యం కుంభకోణంలో నిందితులను తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. వాదనలు విన్న కోర్టు... సాయంత్రం తీర్పు వెలువరిస్తామని తెలిపింది. దీంతో తీర్పును రిజర్వు చేసింది. కానీ తీర్పును మే 29వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ఆ తర్వాత ప్రకటించిన సంగతి తెలిసిందే.
మద్యం కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కీలక సూత్రదారంటూ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆ క్రమంలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మారు పేరుతో గోవా నుంచి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన అతడిని ఏపీ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని సిట్ పోలీసులు విచారించారు. అతడు చెప్పిన ఆధారాలతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిని సైతం విచారించారు. ఇదే కేసులో బాలాజీ గోవిందప్పను సైతం సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే వీరిని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ కేసులో కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని సైతం మరోసారి తమ కస్టడీకి అప్పగించాలంటూ వారు కోర్టును కోరారు. ఆ క్రమంలో సోమవారం ప్రభుత్వం తరపు న్యాయవాది, సిట్ తరపు న్యాయవాదితోపాటు నిందితుల తరపు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీంతో నిందితులను సిట్కు అప్పగించడంపై మే 29వ తేదీన తీర్పు వెలువరిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ పేరు ప్రతిపాదన
ఇక భారత్ను చూసి పాక్ వణకాల్సిందే..
For Andhrapradesh News And Telugu News