Share News

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కూటమి నేతలకు ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Feb 16 , 2025 | 07:46 PM

ఆంధ్రప్రదేశ్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

CM Chandrababu: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కూటమి నేతలకు ఏం చెప్పారంటే..
CM Chandrababu Naidu

అమరావతి: ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన స్ట్రైక్ రేట్‌ రిపీట్ అవ్వాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్షవంటిదేనని, కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతిఒక్కరూ కష్టపడాలని సూచించారు. 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని, ఆ దిశగా ఇప్పుడూ ముందుకెళ్లాలని కోరారు. ఉమ్మడి గుంటూరు-కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం మూడు పార్టీల అభ్యర్థులూ కలిసికట్టుగా పనిచేయాలి. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలి. ఓటర్లను చైతన్యపరచాలి. 2024 ఎన్నికల్లో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమికి ప్రజలు తీర్పునిచ్చారు. అలాంటి గెలుపు కోసం కృషి చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలి. నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పని చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన దాని కంటే మెరుగ్గా ఉండాలి.


ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతిరోజూ పని చేస్తున్నాం. వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించాం. పాలనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చాం. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించాం. దాదాపు రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీని ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా రాష్ట్రమంతటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం.


ప్రతి నెలా 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయిపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్‌లో రూ.780 కోట్లు చెల్లించాం. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీనే డబ్బులు చెల్లిస్తున్నాం. విద్యావంతులైన మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆదాయ మార్గాల కల్పనకు ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేపట్టింది. చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందని" చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..

Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..

Updated Date - Feb 16 , 2025 | 07:47 PM