Share News

Constable Pavankalyan: గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు అశ్రునివాళి

ABN , Publish Date - May 10 , 2025 | 04:55 AM

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ నూగతోటి పవన్‌కల్యాణ్‌కు పోలీసులు, ప్రజలు అశ్రునివాళలు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అతని అంత్యక్రియలు నిర్వహించగా, అధికారులు, ప్రజలు కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు

Constable Pavankalyan: గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు అశ్రునివాళి

  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పీసీపల్లి, మే 9(ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల దాడిలో మృతి చెందిన ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం ముద్దపాడు గ్రామానికి చెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ నూగతోటి పవన్‌కల్యాణ్‌కు పోలీసులు, ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టుల ల్యాండ్‌మైన్‌ దాడిలో ముగ్గురు పోలీసులు మృతి చెందగా వారిలో పవన్‌కల్యాణ్‌ ఉన్నాడు. శుక్రవారం ఉదయం తెలంగాణ పోలీసులు మృతదేహాన్ని ముద్దపాడుకు తీసుకువచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పవన్‌కల్యాణ్‌ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం అధికారులు, ప్రజలతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. సంతాప సూచికంగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి అంతిమ వీడ్కోలు పలికారు.

Updated Date - May 10 , 2025 | 04:55 AM