Dy CM Pawan kalyan: మత్స్యకారులతో త్వరలో సమావేశం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:21 AM
అసెంబ్లీ సమావేశాలు అనంతరం మత్స్యకారులతో తాను సమావేశం అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. వారి సమస్యలపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేాాశామన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 24: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కష్ట జీవులకు భరోసా కల్పిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమం కోసం తాము ప్రాధాన్యమిస్తామన్నారు. ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం తానే స్వయంగా ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమై.. అన్ని సమస్యలను వారితో సమగ్రంగా చర్చిస్తానని పేర్కొన్నారు. అయితే వారికి సంబంధించి అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా.. మత్స్యకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో.. తాను అర్థం చేసుకోగలనని వివరించారు. వీరి సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు, మత్స్యకారుల ప్రతినిధులు, స్థానిక నాయకులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
అయితే ప్రస్తుతం తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేక పోతున్నానన్నారు. ఆ క్రమంలో మత్స్యకారుల సమస్యలపై తాను నేరుగా చర్చించలేక పోతున్నానని వివరించారు. కానీ వారి సమస్యల పరిష్కారం కోసం సోమవారం నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తున్నామన్నారు. మత్స్యకారులు.. ప్రస్తావిస్తున్న ప్రతి సమస్యను పరిగణనలోకి తీసుకొని వాటి పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
అలాగే కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీష్, రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు కాకినాడ జిల్లా కలెక్టర్తో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అందులో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని కూడా నిర్ణయించామని తెలిపారు. సమస్యల పరిష్కారంతోపాటు జీవనోపాధిలో మెరుగుదల, తీర ప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైనా ఈ కమిటీ దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు.
అదే విధంగా నష్ట పరిహారం మదింపుపై సైతం ఈ కమిటీ చర్చిస్తుందన్నారు. ఈ కమిటీ మత్స్యకారుల సమస్యలను అధ్యయనం చేసి, అమలు చేయదగిన సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేస్తుందని వివరించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించామన్నారు. మరణించిన 18 మంది మత్స్యకారులకు సంబంధించి.. వారి కుటుంబాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వద్ద దెబ్బ తిన్న పడవలకు నష్ట పరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించానని చెప్పారు.
అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించానని పేర్కొ న్నారు. ఇక మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపైనా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఇప్పటికే స్పష్టం చేశానని వివరించారు. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని వారికి సూచించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివరించారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ ద్వారా బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు విశ్రాంతి అవసరమంటూ ఆయనకు వైద్యుల సూచించారు. దీంతో ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఆ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ ద్వారా మత్స్యకారుల సమస్యలపై స్పందించారు.