Uttarakhand CM: డిసెంబర్ 25న అమరావతిలో బహిరంగ సభ: ఉత్తరాఖండ్ సీఎం ధామి
ABN , Publish Date - Dec 14 , 2025 | 09:52 PM
పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్పేయి జీవితం అందరికీ నేర్పుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో సీఎం ధామి మాట్లాడారు.
తిరుపతి, డిసెంబర్ 14: మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కొనియాడారు. పదవుల కంటే ప్రజల సేవే ముఖ్యమని వాజ్పేయి జీవితం నేర్పిందని, పోక్రాన్ అణుపరీక్షల నుంచి దేశాభివృద్ధి వరకు ఆయన చేసిన ప్రయత్నాలు అపూర్వమని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగు నింపడమే ఆయన లక్ష్యమని గుర్తు చేశారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో సీఎం ధామి మాట్లాడారు. వాజ్పేయి ఆదర్శాలను కొనసాగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్ను నిర్మిస్తున్నారని ధామి చెప్పుకొచ్చారు. ఆధునిక విమానాశ్రయాలు, గగన్యాన్, చంద్రయాన్, వందే భారత్ రైళ్లతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పాలన సాగుతోందని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలతోపాటు ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్లు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు.
త్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలతో దేశాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని ప్రధాని మోదీ నడిపిస్తున్నారని ధామి అన్నారు. అయోద్య రామ మందిర నిర్మాణం, వారణాశి-ఉజ్జయినీ మాస్టర్ ప్లాన్లు, కేదార్నాథ్-బద్రీనాథ్ అభివృద్ధితో సనాతన ధర్మ పరిరక్షణ గొప్పగా జరుగుతోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటింగ్, రక్షణ ఉత్పత్తులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కూటమి పాలనలో తిరుపతి ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రంగా మరింత విరాజిల్లనుందని ధామి అన్నారు. డిసెంబర్ 25న అమరావతిలో బహిరంగ సభ ఉంటుందని సీఎం ధామి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఉత్తరాఖండ్ అభివృద్ధిలో కొత్త ఊపిరి పోస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పిన ధామి, లవ్ జిహాద్, మతమార్పిడులు, యూనిఫాం సివిల్ కోడ్పై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చివరగా, ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని సంకల్పం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పేదలపై భారం మోపని పన్ను విధానం అవసరం: యనమల
విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్
Read Latest AP News And Telugu News