CM Chandrababu : బీసీ విద్యార్థుల డైట్ చార్జీలు చెల్లించాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:33 AM
ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధులు
వైసీపీ హయాంలోని బకాయిల విడుదలకు అనుమతి
కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్
బీసీ సంక్షేమశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): బీసీ విద్యార్థుల కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలతో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని, ప్రభుత్వం చేసే ఖర్చుకు జవాబుదారీతనం కనిపించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో బీసీ సంక్షేమశాఖపై సమీక్ష చేశా రు. రాష్ట్రంలోని 660 ప్రభుత్వ హాస్టళ్లలో రూ.13.10 కోట్లతో చేపట్టిన మరమ్మతులు మరో 6 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, కిచెన్ ఐటమ్స్ అందించలేదని, రూ.18 కోట్లతో వాటి పంపిణీకి చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించగా, ఈ ప్రక్రియ కూడా మార్చి మూడో వారం నాటికి పూర్తవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న ట్యూటర్ల గౌరవవేతనాలకు సంబంధించి 485 హాస్టళ్లలో 2024 మార్చి వరకు గత ప్రభుత్వం పెట్టిన రూ.2.02 కోట్ల బకాయిలు, ఈ ఏడా ది ఫిబ్రవరి వరకు చెల్లించాల్సి ఉన్న రూ.2.33 కోట్ల బకాయిలు మొత్తం కలిపి రూ.4.35 కోట్లు చెల్లించాల్సిన ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు. డైట్ చార్జీలకు సంబంధించి రూ.185.27 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అధికారులు వివరించగా ప్రస్తుతం రూ.110.52 కోట్ల చెల్లింపునకు సీఎం అంగీకారం తెలిపారు. అదేవిధంగా కాస్మెటిక్ బిల్లులు రూ.29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. హాస్టళ్ల విద్యుత్ పెండింగ్ బిల్లులు కూడా వెంటనే చెల్లించాలన్నారు. సత్యసాయి జిల్లాలోని నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కార్పొరేషన్లకు నిధులు ఇలా...
బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేబినెట్లో కూడా ఆమోదం తెలిపామని, ఆ మేరకు అవసరమైతే న్యాయ పోరాటం చేయాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. అలాగే ప్రతి కార్పొరేషన్కూ దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, దీనిపై ఇప్పటికే విధి విధానాలు రూపొందించామని తెలిపారు. రజకులకు మేలు చేకూరేలా రాష్ట్రంలో 2014-19 మధ్య నిర్మించిన దోబీఘాట్ల మరమ్మతులు, అవసరమైన చోట కొత్తవి నిర్మించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. రానున్న బడ్జెట్లో కేటాయించే నిధులతో రాష్ట్రంలో బీసీ భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 2014 నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిపొందిన వారి సమాచారం సేకరించాలని, వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ప్రస్తుతం ఎంత మంది కొనసాగిస్తున్నారో ఆడిట్ చేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి