CM Chandrababu Accelerates: నామినేటెడ్ పదవులన్నీ వారంలో భర్తీ
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:03 AM
నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియ్సగా తీసుకున్నారు...
ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు.. ఇప్పటి వరకు 80 శాతం పూర్తి
మిగిలిన 20 శాతం పదవులపై దృష్టి.. కూటమి పక్షాల నుంచీ పేర్లు
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక.. తాజాగా మరో 120 మంది డైరెక్టర్ల నియామకం
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): నామినేటెడ్ పదవుల భర్తీ విషయాన్ని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియ్సగా తీసుకున్నారు. వారంలోగా మిగిలిన కార్పొరేషన్లు, దేవాలయాల కమిటీలతో పాటు అన్నిరకాల నామినేటెడ్ పదవులను భర్తీచేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నామినేటెడ్ పదవుల భర్తీ నెమ్మదిగా సాగింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తొలి విడతగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో 20 కార్పొరేషన్లు భర్తీ చేయగా, మలి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి 8నెలల సమయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 132 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పదవుల భర్తీలో జాప్యం జరుగుతుండటం, ఆశావహుల పేర్లను ఎమ్మెల్యేలు ఇవ్వకపోవడంపై ‘పార్టీ అధ్యక్షా.. పదవులెక్కడ’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్ల పదవులను ఆగమేఘాలపై భర్తీ చేస్తున్నారు. తాజాగా 11కార్పొరేషన్లకు 120 మంది డైరెక్టర్లను నియమించారు. వీరిలో బీసీలు 42మంది ఉండగా, మైనార్టీలు 15, ఓసీలు 40, ఎస్సీలు 23 మంది ఉన్నారు. భాగస్వామ్య పక్షాల నుంచీ పేర్లు తీసుకుని వారంలోగా మొత్తం నామినేటెడ్ పదవుల భర్తీ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News