Share News

RTI Power Clash: సీఎస్‌ కంటే నేనే సుప్రీం

ABN , Publish Date - May 10 , 2025 | 04:09 AM

సీఎస్‌ ఉత్తర్వులకే ఎదురుదెబ్బ ఇస్తూ, ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ బాషా తనే సుప్రీం అంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన సెక్రటరీకి కార్యాలయంలో ప్రవేశం నిరాకరించడంతో వివాదం ముదిరింది

RTI Power Clash: సీఎస్‌ కంటే నేనే సుప్రీం

  • తీరు మార్చుకోని సీఐసీ బాషా

  • ఆర్టీఐ కార్యదర్శికి సహకరించొద్దని పేర్కొంటూ సిబ్బందికి సర్క్యులర్‌

  • ఆఫీసులోకి రానివ్వొద్దని హుకుం

అమరావతి, మే 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఇచ్చిన ఉత్తర్వులంటే ఏమాత్రం లెక్కలేదు. సమాచార కమిషన్‌ కార్యదర్శిగా సర్కారు నియమించిన అధికారి పట్ల కనీస మర్యాద కూడా లేదు. ‘సీఎస్‌ కంటే నేనే సుప్రీం’ అంటూ చెలరేగుతున్నారు చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ కమిషనర్‌(సీఐసీ) ఆర్‌.ఎం.బాషా ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ అధికారి వి. ఆంజనేయులను ప్రభుత్వం సమాచార కమిషన్‌ సెక్రటరీగా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ, ఆంజనేయులకు ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ ఎం. బాషా కనీసం అప్పాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. పైగా సెక్రటరీ గదికి తాళాలు వేయించడంతో ఆంజనేయులు చాలా సేపు ఎదురుచూసి, అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని జీఏడీ సెక్రటరీ శేషగిరిబాబుకు తెలియజేయడంతో పాటు సీఎస్‌ విజయానంద్‌కు రహస్య నివేదికను అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ ఎం. బాషా తాజాగా ఓ ఉత్తర్వు ఇచ్చారు. ‘చీఫ్‌ కమిషనర్‌ నిర్ణయాలు, ఆదేశాల మేరకే ఆర్‌టీఐ కార్యాలయం నడుస్తుంది. దీనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.’ అన్నట్టుగా సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఈ ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం నియమించిన సెక్రటరీని విధుల్లో చేరనీయకుండా అడ్డుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా, ఆంజనేయులు తనకు జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వలేదని, జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వకుండా తన కార్యాలయంలోకి రావడానికి వీలు లేదని స్పష్టం చేశారు. సమాచార కమిషన్‌ సెక్రటరీని నియమించే క్రమంలో ఖచ్చితంగా ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ అనుమతి తీసుకోవాలని, ప్రభుత్వం ఆ నిబంధనను పాటించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన సెక్రటరీ అనవసరంగా సమాచార కమిషనర్‌ పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ఇది చట్ట విరుద్ధమని తెలిపారు. అంతేకాదు, కొత్త సెక్రటరీకి ఎలాంటి సహకారం అందించకూడదంటూ కమిషన్‌ కార్యాలయ ఉద్యోగులు, సెక్యూరిటీ, సిబ్బందికి సర్క్యులర్‌ జారీ చేశారు.


ఆంజనేయులు తనకు ఎలాంటి జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వలేదని, కానీ.. ఇది చాలా అవసరమని పేర్కొన్నారు. జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వలేదు కాబట్టి పరిపాలనా వ్యవహారాల్లో ఆయనకు జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. అనధికారికంగా ఆంజనేయులు కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం తమకు వచ్చిందని, కాబట్టి ఆయనను కార్యాలయంలోకి రానివ్వకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ రాత పూర్వక అనుమతి లేకుండా కార్యాలయంలోకి రానివ్వద్దని హుకుం జారీ చేశారు. ఈ ఉత్తర్వులు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా సమాచార కమిషన్‌ కార్యాలయ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రభుత్వం నియమించిన సెక్రటరీనే.. కార్యాలయంలోకి రావడానికి వీల్లేదని పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయడం మరింత దుమారం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ 2025 వేడకలు..

ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్

పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

For More AP News and Telugu New

Updated Date - May 10 , 2025 | 04:09 AM