Tirumala Tirupati Devasthanams: భక్తులకు మళ్లీ టీటీడీ గుడ్ న్యూస్
ABN , Publish Date - Nov 16 , 2025 | 08:42 PM
శ్రీవారి భక్తులకు మళ్లీ టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెెట్లు ఎప్పుడు విడుదల చేసేది వివరించింది.
తిరుమల, నవంబర్ 16: భక్తుల కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఈ టికెట్లను విడుదల చేస్తున్నట్లు టీటీడీ ఆదివారం ప్రకటించింది. వీటి ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20వ తేదీ 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని భక్తులకు సూచించింది. అలాగే అంగప్రదక్షణ టోకెన్లను ఇదే విధంగా నమోదు చేసుకున్నాక.. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేస్తారు. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక 24వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.
25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రతేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులో ఉంటుంది. https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జిత సేవలు, సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.