Pawan Kalyan: పెద్దిరెడ్డి ఫ్యామిలీపై చర్యలకు రంగం సిద్ధం
ABN , Publish Date - May 13 , 2025 | 10:02 PM
Pawan Kalyan: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించిన దర్యాప్తు పూర్తయింది. ఆ నివేదిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి చేరింది. ఈ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.
అమరావతి, మే 13: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ప్రభుత్వం చేపట్టిన విచారణలో క్లియర్ కట్గా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో నివేదికలోని సిఫార్సుల ఆధారంగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఆ క్రమంలో ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి కుటుంబీకులపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోనుంది.
అయితే ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించ లేని వారిని బాధ్యులను చేయాలని సదరు నివేదికలో సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశముంది. అదే విధంగా ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. దాంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు కానున్నాయి.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు నివేదిక అందజేశారు.
ఈ నివేదికను పరిశీలించి.. అటవీ భూముల అక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన కూలంకుషంగా చర్చించారు. అనంతరం నివేదికలోని సిఫార్సుల ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. అదే విధంగా భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ అగ్రనేతలు.. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు భారీగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాంటి వేళ.. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకు వస్తోంది. ఆ క్రమంలో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, మద్యం కుంభకోణం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించి.. కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అందులోభాగంగా వైసీపీలోని పలువురు పెద్దలు అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..