CM Chandrababu: అమరావతి నిర్మాణాలకు ఇసుక సిద్ధం చేయండి
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:28 AM
రాష్ట్రంలో పెరుగుతున్న నిర్మాణాల నేపథ్యంలో కోటి టన్నుల ఇసుక నిల్వలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు గనుల శాఖను ఆదేశించారు. అమరావతితో పాటు పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇసుక అవసరమవుతుందని పేర్కొన్నారు

గనుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గృహనిర్మాణరంగం, అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నందున ఇసుక నిల్వలు భారీగా పెంచాలని గనుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు, అనేక ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలవుతున్నందున భారీగా ఇసుక అవసరం ఉందన్నారు. వాటి కోసం ఇసుక కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బుధవారం గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్తో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అమరావతిలో ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలు తమకు కనీసం కోటిన్నర క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కావాలని డిమాండ్ నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వర్షాకాలం రాకముందే ప్రభుత్వ ప్రాజెక్టుల అవసరాల కోసమే కోటి టన్నుల మేర ఇసుకను రిజర్వ్చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఈ దిశగా గనుల శాఖ కార్యాచరణ ప్రణాళిక రెడీచేసుకోవాలన్నారు.
Read Latest AP News And Telugu News