Share News

Chandrababu Naidu: నైపుణ్యంతో నాణ్యమైన సేవలు

ABN , Publish Date - May 08 , 2025 | 04:20 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ శిక్షణ ద్వారా రాష్ట్రంలో సేవల నాణ్యత పెంచాలని ఆయన అన్నారు

Chandrababu Naidu: నైపుణ్యంతో నాణ్యమైన సేవలు

  • ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ప్రతి ఉద్యోగికి శిక్షణ

  • నేను నిత్యం కొత్త విషయాలు నేర్చుకుంటా..టెక్నాలజీ గురించి తెలుసుకుంటా

  • స్వర్ణాంధ్ర, జీఎ్‌సడీపీపై చంద్రబాబు సమీక్ష

  • ముఖ్యమంత్రి చైర్మన్‌గా పీ4 ఫౌండేషన్‌

  • జనాభా నిర్వహణపై త్వరలో ప్రత్యేక విధానం

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉద్యోగులందరూ నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల శిక్షణతో సామర్థ్యం పెంచడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. వ్యవసాయ శాఖ అధికారి నుంచి సెక్రటరీ వరకు, కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకు అందరూ నైపుణ్యాలు మెరుగు పర్చుకోవాలని సూచించారు. బుధవారం సచివాలయంలో ప్రణాళిక, స్వర్ణాంధ్ర విజన్‌, జీఎస్డీపీపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ‘నేను కూడా నిత్యం మెరుగైన సేవలందించేందుకు అవసరమైన సామర్థ్యాల పెంపుపై దృష్టి పెడతాను. కొత్త విషయాలు నేర్చుకుంటా. టెక్నాలజీ గురించి తెలుసుకుంటా. సాంకేతికత ద్వారా పాలనతో ఎలాంటి మార్పులు తేవచ్చనేది తెలుసుకుంటాను. ప్రతి ఉద్యోగి శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. సేవల్లో నాణ్యత పెరుగుతుంది’ అని చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్యం చేరుకోవడం కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం కాగా, నియోజకవర్గాల వారీగా విజన్‌ ప్లాన్‌ వచ్చే నెల నాటికి రూపొందిస్తామని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికకు సంబంధించిన నివేదికలు ఒకటి జూన్‌ నాటికి, మరొకటి సెప్టెంబర్‌ నాటికి రూపొందుతాయని అధికారులు వివరించారు.


కీలక విధానాలైన జీరో పావర్టీ పీ4, జనాభా నిర్వహణ అంశాలను విజన్‌లో పొందుపరుస్తారు. ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాపులు మే 9తో పూర్తవుతాయని అధికారులు చెప్పారు. నియోజకవర్గ విజన్‌ కార్యాచరణ ప్రణాళిక యూనిట్లు నెలకొల్పేందుకు 143 స్థలాలు గుర్తించారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 15,315 బంగారు కుటుంబాలను 1,118 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. పీ4 కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా 25 మందితో కూడిన రాష్ట్రస్థాయి కమిటీ వేస్తారు. దీనికి అనుబంధంగా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, సాధికార బృందాలతో పీ4 ఫౌండేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

జనాభా సమతుల్యతే లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జనాభా నిర్వహణ విధానం తీసుకొస్తున్నారు. జనాభా సమతుల్యత అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువస్తోంది. జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. మహిళా ఉద్యోగులకు ఇద్దరు పిల్లల వరకు ఇచ్చే ప్రసూతి సెలవుల పరిమితిని ఎత్తివేసింది. అలాగే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా మినహాయింపు ఇచ్చింది. జనాభా పెరుగుదలకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించి వాటి ఆధారంగా విధానం రూపొందిస్తామని అధికారులు చెప్పారు. సమీక్షా సమావేశంలో ముందుగా ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ జరిగింది. ఉగ్రస్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులపై ముఖ్యమంత్రి ప్రశంసించారు. పహల్గాం దాడికి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రం గట్టి సమాధానం ఇచ్చిందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ దాడిలో మరో కుట్ర..

ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్

ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 04:20 AM