BJP Leader Vishnuvardhan Reddy : ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదు
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:51 AM
ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్ అడిగితే ఇచ్చేది కాదు. ప్రజలు నిర్ణయిస్తారు’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు.

ప్రజా తీర్పును జగన్ శిరసావహించాలి
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి: విష్ణువర్ధన్రెడ్డి
కర్నూలు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్ష హోదా వైఎస్ జగన్ అడిగితే ఇచ్చేది కాదు. ప్రజలు నిర్ణయిస్తారు’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని మౌర్యఇన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ పరమహంసతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అధికారం ఉంటేనే ప్రజల గురించి పట్టించుకుంటాను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్ చెప్పటం విడ్డూరంగా ఉంది. వైసీపీ పాలనలో ప్రజలకు మంచి జరిగి ఉంటే గత ఎన్నికల్లో ఒక్క మంత్రి మినహ మిగిలిన మంత్రులు అందరూ ఎందుకు ఓటమి పాలయ్యారు? కూటమి ప్రభుత్వంలోని మంత్రులను లక్ష్యంగా చేసుకుని తమకు అనుకూలమైన మీడియాలో నిత్యం అసత్య ప్రచారం చేయడం తగదు. కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. 8 నెలల్లోనే అద్భుతాలు జరగవు. వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడాలి’ అని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతులు, ప్రజలను జలచోరులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తన పదవిని కాపాడుకునేందుకే ఆయన రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృషిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక కష్టాల నుంచి ఏపీ నిలదొక్కుకుంటుంటే, అన్నీ ఉన్న తెలంగాణను అక్కడి పాలకులు అప్పుల ఊబిలోకి తీసుకవెళ్లారని విమర్శించారు.