Inter Syllabus Change: ఎంపీసీలో చరిత్ర... బైపీసీలో జాగ్రఫీ
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:52 AM
ఇంటర్మీడియట్ విద్య రాష్ట్రంలో వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు..
ఏపీలో సరికొత్త ఇంటర్ విద్య
ఎలక్టివ్ విధానం తెచ్చిన వైవిధ్యమిది
24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు
ఒకరోజు ఒక సబ్జెక్టుకే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక
(అమరావతి, ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్య రాష్ట్రంలో వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకూ ఇంటర్మీడియట్ విద్య అంటే సంబంధిత సబ్జెక్టులే చదవాలి అనే నిబంధన ఉండేది. ఎంపీసీ విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ర్టీ కాకుండా మరో సబ్జెక్టు చదివే అవకాశం ఉండేది కాదు. అలాగే బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ర్టీలు మాత్రమే చదవాలి. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో తీసుకొచ్చిన మా ర్పులతో కోర్ సబ్జెక్టులను ఎలాగైనా చదువుకునే వెసులుబాటు కలిగింది. దీంతో విద్యార్థులు వైవిధ్యమైన కాంబినేషన్లో సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకూ ఎంపీసీ, బైపీసీల్లో ఆరేసి సబ్జెక్టులు, మిగిలిన గ్రూపుల్లో ఐదు చొప్పున సబ్జెక్టులున్నాయి. ఇంటర్ బోర్డు ఈ ఏడాది నుంచి ఎంపీసీలో ఏ,బీలుగా ఉన్న గణితం సబ్జెక్టులను ఒక్కటిగా కలిపింది. బైపీసీలో ఉన్న బోటనీ, జువాలజీని బయాలజీగా మార్చింది. దీంతో అన్ని గ్రూపుల్లో 5 సబ్జెక్టుల విధానం అమల్లోకి వచ్చింది. ఇకనుంచి ద్వితీయ భాష సబ్జెక్టు స్థానంలో ఎలక్టివ్ సబ్జెక్టును వచ్చింది. అంటే మొత్తం ఇంటర్ విద్యలో అందుబాటులో ఉన్న 24 సబ్జెక్టులను ఎలక్టివ్ సబ్జెక్టు కింద తీసుకోవచ్చు. అయితే, ఎంపికలో పరిమితులు లేవు. దీంతో ఎంపీసీ విద్యార్థులు బయాలజీ తీసుకుంటే, బైపీసీ విద్యార్థులు గణితం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పులతో విద్యార్థులకు ఎంబైపీసీ చదివే అవకాశం వచ్చింది. సాంకేతికంగా ఎంబైపీసీ పేరుతో గ్రూపులేకపోయినా ఎంపీసీ విద్యార్థులు బయాలజీ, బైపీసీ విద్యార్థులు గణితం చదివే వెసులుబాటు కలిగింది. అయితే ఎంబైపీసీ కోసం ఇంటర్ బోర్డు మరో అవకాశం కూడా కల్పించింది. ఈ రెండు గ్రూపుల విద్యార్థులకు అదనపు సబ్జెక్టు తీసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఈ అదనపు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించకపోయినా ఇంటర్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ ఇవే సబ్జెక్టులను ఎలక్టివ్గా తీసుకున్నవారు కచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. అదనపు సబ్జెక్టు తీసుకున్న వారికి మొత్తం ఆరు సబ్జెక్టులు ఉంటాయి. మొత్తంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్టియర్లో 5,40,924 మంది అడ్మిషన్ పొందారు.
ఒకరోజు ఒక సబ్జెక్టే
ఎంబైపీసీ, ఎలక్టివ్ విధానం ప్రవేశపెట్టడంతో పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు మార్చనుంది. ప్రతి సంవత్సరం గణితం సబ్జెక్టు ఉన్నరోజే బోటనీ, జువాలజీ పరీక్షలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎంబైపీసీ తీసుకున్నవారు రెండూ ఒకేరోజు రాయడం సాధ్యం కాదు కాబట్టి వేర్వేరు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫస్టియర్ విద్యార్థులకు ఒక రోజు ఒకే సబ్జెక్టు పరీక్ష ఉండేలా మార్పులు చేయనున్నారు. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి మార్చికి బదులుగా ఫిబ్రవరి నుంచే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News