High Court: హైకోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులు
ABN , Publish Date - Jan 16 , 2025 | 04:30 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది.

యడవల్లి లక్ష్మణరావు, హరిహరనాథ శర్మ పేర్లు
సిఫారసు చేసిన సుప్రీం కొలీజియం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జీలు
అమరావతి/న్యూఢిల్లీ, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావును నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ఈ నెల 11న జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. ప్రస్తుతం కొలీజియం సిఫారసు చేసిన ఇద్దరూ వస్తే ఆ సంఖ్య 30కి చేరుతుంది. ఇంకో ఏడు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా.. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఆ రాష్ట్రంలో సీనియర్ న్యాయాధికారులు రేణుక యార, నందికొండ నర్సింగ్రావు, ఈ తిరుమలదేవి, బీఆర్ మధుసూదన్రావులను అక్కడి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరి నియామకాలకు రాష్ట్రపతి ఆమోదం లభించగానే పదవీప్రమాణం చేస్తారు.
న్యాయవాదిగా.. జిల్లా జడ్జిగా..
హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. ఆయన స్వస్థలం కర్నూలు. తల్లిదండ్రులు రామచంద్రయ్య, సుబ్బమ్మ. తండ్రి పురోహితుడు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన హరిహరనాథశర్మ నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 1998లో సొంత ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2017-18 నడుమ అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి(పీడీజే)గా, 2020-22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా పనిచేశారు. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
ఏయూ నుంచి పీహెచ్డీ..
డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పద్మావతి. ప్రాఽథమిక విద్యను ప్రకాశం జిల్లాలో పూర్తి చేసిన ఆయన.. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు పొందారు. 2000లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశంజిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 2014లో జ్యుడీషియల్ సర్వీసులోకి వచ్చారు. మొదట ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబరు 2న హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా నియమితులయ్యారు. 2022 అక్టోబరు 22న రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు.