AP High Court : కల్లుగీత కులాలకు హైకోర్టులో ఊరట
ABN , Publish Date - Feb 05 , 2025 | 04:35 AM
మద్యం దుకాణాల యజమానులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే, వారికి ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
మద్యం లైసెన్సుల కేటాయింపుపై స్టేకు నిరాకరణ
కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కల్లుగీత కులాలకు మద్యం దుకాణాల లైసెన్స్ ఖరారు చేయకుండా నిలువరించాలంటూ మద్యం దుకాణాల యజమానులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే, వారికి ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులు తుదితీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో 10శాతం మద్యం దుకాణాలను లైసెన్సింగ్ ఫీజులో 50శాతం రాయితీతో కల్లుగీత వర్గానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పలువురు మద్యం దుకాణాల యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఒ.మనోహర్రెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,450 మద్యం దుకాణాల్లో 10శాతం(340) దుకాణాలను కల్లుగీత కులాలకు కేటాయించడం చట్టవిరుద్ధమన్నారు. కల్లుగీత కులాలకు లైసెన్స్ ఖరారు ప్రక్రియపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. పిటిషనర్లది ఆందోళన మాత్రమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలు, కులాలను గుర్తించి వారికి రాయితీపై మద్యం దుకాణాలు కేటాయించేందుకు ఎక్సైజ్చట్టంలో వెసులుబాటు ఉందన్నారు. 2024లో తీసుకొచ్చిన మద్యం పాలసీలో గీత కార్మికులకు రాయితీపై 10శాతం షాపుల కేటాయింపు విషయం స్పష్టంగా ఉందని, అన్ని విషయాలు తెలుసుకొనే పిటిషనర్లు మద్యం దుకాణాల లైసెన్స్ వేలంలో పాల్గొన్నారని తెలిపారు. కల్లుగీత వర్గానికి 340 దుకాణాలు కేటాయించడం వల్ల 3000 మంది దుకాణాల యాజమానులకు నష్టం జరిగితే, వారి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.