AP High Court : 6 వరకు తొందరపాటు చర్యలొద్దు
ABN , Publish Date - Jan 01 , 2025 | 04:04 AM
గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): గోడౌన్ నుండి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినానిపై సోమవారం వరకు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యంపై విచారణను జనవరి 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి మంగళవా రం ఉత్తర్వులు జారీ చేశారు. పేర్ని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోదామును పౌరసరఫరాలశాఖకు లీజుకిచ్చారు. ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమయ్యాయ ని ఆ శాఖ అధికారి కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమో దు చేశారు. తాజాగా పేర్ని నానిని ఏ-6గా చేర్చా రు. పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంద ని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి లంచ్మోషన్గా విచారణకు స్వీకరించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. గోడౌన్లోని బియ్యం నిల్వలతో పేర్ని నానికి సంబంధం లేదని.. రాజకీయ కారణాలతో నిందితుడిగా చేర్చారని తెలిపారు. సోమవారం రాత్రి 70 మంది పోలీసులు ఆయన నివాసం వద్దకు వచ్చారని, అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ... వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని.. కేసు వివరాలు తెప్పించుకునేందుకు సమయం కోరారు. రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించి, వాటిని విక్రయించడంలో పిటిషనర్ది కీలక పాత్ర అని, వాస్తవాలను వెలికితీసేందుకు కస్టోడియల్ విచారణ అవసరమని తెలిపారు. సీనియర్ న్యాయవాది రఘు స్పందిస్తూ.. ప్రాసిక్యూషన్ వివరాలు తెప్పించుకునేందుకు సమయం కోరుతున్నందు న పిటిషనర్పై తొందరపాటు చర్యలువద్దన్నారు.