AP Govt : ఆలయాల ఎఫ్డీల జోలికెళ్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:47 AM
ఆలయాల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈవోలు, ఇతర ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
ఇష్టారాజ్యంగా అధికారులు బ్రేక్ చేయడానికి వీల్లేదు
పకడ్బందీగా నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం
అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): దేవాలయాల ఆస్తుల సంరక్షణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈవోలు, ఇతర ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వాడుకోవడానికి వీల్లేకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కమిషనర్ అనుమతులు లేకుండా ఎఫ్డీలు ఎన్క్యాష్ చేస్తే ఈవోతో పాటు సంబంధిత ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకునేలా నిబంధనలు మార్చింది. దేవదాయ శాఖలోని చాలా మంది ఈవోలు వారు విధులు నిర్వహించే ఆలయాలకు సంబంధించిన ఎఫ్డీలను ఇష్టమొచ్చినట్లు బ్రేక్ చేస్తున్నారు. దేవుడి సొమ్మును సొంత వ్యవహారాలకు వాడుకుంటున్నారు. కొంత మంది ఈవోలు ఎఫ్డీలను చూపించి వ్యక్తిగత రుణాలు కూడా పొందుతున్నారు. మరికొందరు బరితెగించి ఈ ఎఫ్డీ సొమ్ములను బెట్టింగ్లకు కూడా వాడేస్తున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు దేవదాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకపై ఎఫ్డీలను బ్రేక్ చేసి ఎన్క్యాష్ చేసేందుకు వీలు లేకుండా పలు నిబంధనలతో దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సోమవారం ప్రత్యేక సర్క్యులర్ జారీ చేశారు.
ఎఫ్డీలపై రుణాలకు వీల్లేదు
ఎఫ్డీలను ఎలా సంరక్షించాలి, ఎలా ఎన్క్యాష్ చేయాలన్న దానిపై కమిషనర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈవోలే కాదు ఆసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు కూడా ఎఫ్డీలు ఎన్క్యాష్ చేయడానికి వీలులేకుండా పకడ్బందీగా నిబంధనలు తీసుకొచ్చారు. 6ఏ, 6బీ, 6సీ ఆలయాల ఈవోలతో పాటు ఆర్జేసీ, డీసీ, ఏసీలు వారి వారి పరిధిలో ఉన్న దేవాలయాల ఎఫ్డీలకు సంబంధించిన రిపోర్టును ఏటా మార్చి 31నాటికి కమిషనర్ కార్యాలయానికి అందించాలి. భూముల అమ్మకం, ఆలయం సేవింగ్స్, అన్నదానం ఎఫ్డీలు ఇలా ప్రతి ఒక్కటి ఉన్నతాధికారులు తనిఖీలు చేసి, ఎఫ్డీలు ఏమైనా ఎన్క్యాష్ అయితే వెంటనే కమిషనర్కు రిపోర్టు ఇవ్వాలి. రెన్యువల్ చేయాల్సి వచ్చినపుడే ఎఫ్డీలు ఎన్క్యాష్ చేసి.. వెంటనే మరో ఎఫ్డీ వేసే విధంగా ఆలయాల ఈవోలు, జిల్లా ఎండోమెట్ అధికారులు ఆయా బ్యాంక్లకు లేఖలు రాయాలి. జాయింట్ అకౌంట్పైనే ఎఫ్డీలు వేయాలి. 6సీ ఆలయాలకు సంబంధించిన ఎఫ్డీలు ఆలయం ఈవో పాటు జిల్లా ఎండోమెంట్ అధికారి పేరు మీద, అలానే 6బీ, 6ఏ ఆలయాల ఎఫ్డీలు ఈవోతో పాటు డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్తో జాయింట్గా చేయాల్సి ఉంటుంది. ఎఫ్డీలపై ఈవోలు ఎలాంటి రుణాలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎఫ్డీలు బ్రేక్ చేసి ఎన్క్యాష్ చేయాల్సిన అవసరం ఏదైనా వస్తే కచ్చితంగా దేవదాయ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. ఈ చర్యలతో ఆలయాల ఎఫ్డీలకు రక్షణ కల్పించవచ్చునని భావిస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
దేవదాయ కమిషనర్ సర్క్యులర్లో ఇటీవల కర్నూలు, రాజమండ్రి, చీరాలలో కొంత మంది ఈవోలు ఎఫ్డీలు ఎన్క్యాష్ చేశారని స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్క్యాష్ చేశాక చాలా రోజుల వరకూ బయట పడటం లేదు. ఆడిట్ జరిగినప్పుడో ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తప్ప ఈ విషయాలు వెలుగులోకి రావడం లేదు. దీంతో కొంతమంది ఈవోలు దేవుడి నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుని జల్సాలు చేస్తున్నారు. కర్నూలుకు చెందిన ఒక ఈవో ఇటీవల ఎఫ్డీలను ఎన్క్యాష్ చేసి క్రికెట్ బెట్టింగ్లు ఆడారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉండవల్లి గ్రూప్ టెంపుల్స్, మదడం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఎఫ్డీలకు సంబంధించి కోటి ఎన్క్యాష్ చేశారు. ఆ డబ్బులు సొంతానికి వాడుకున్నారు. ఎఫ్డీలను దుర్వినియోగం చేస్తున్న ఈవోలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు. గత ఆరు నెలల్లో పది ఆలయాలకు సంబంధించిన ఎఫ్డీలు ఎన్క్యాష్ చేసినట్లు కమిషనర్ దృష్టికి వచ్చినా ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. దీంతో ఈవోలకు భయం లేకుండాపోతోంది. కఠిన నిబంధనలు పెట్టడంతో పాటు తప్పు చేసిన వారికి వెంటనే శిక్ష విధిస్తే మరోసారి తప్పులు చేయడానికి ఈవోలు భయపడతారని దేవదాయ శాఖ సిబ్బంది సూచిస్తున్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?