AP Govt : హౌసింగ్ గోడౌన్లకు ఇన్చార్జిలుగా రెగ్యులర్ ఉద్యోగులే!
ABN , Publish Date - Feb 01 , 2025 | 03:56 AM
మండలాల్లోని గోడౌన్లకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇకపై అన్ని గోడౌన్లకు రెగ్యులర్ హౌసింగ్ ఏఈలు..
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
అక్రమాల నేపథ్యంలో కార్పొరేషన్ ఎండీ ఉత్తర్వులు
అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ గోడౌన్లలో నిల్వ చేసిన కోట్లాది రూపాయల విలువైన సిమెంట్, స్టీలు, ఇసుక, ఇతర సామగ్రి మాయమైన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మండలాల్లోని గోడౌన్లకు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇకపై అన్ని గోడౌన్లకు రెగ్యులర్ హౌసింగ్ ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లనే ఇన్చార్జిలుగా నియమించాలని ఆదేశించింది. వారు లేని చోట్ల గ్రామ, వార్డు సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించాలని నిర్దేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల హౌసింగ్ హెడ్లకు ఆదేశిస్తూ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పి.రాజబాబు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఇక నుంచి అన్ని గోడౌన్లలో నిల్వల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ బాధ్యతలను రెగ్యులర్ ఉద్యోగులే నిర్వర్తించనున్నారు. ఫిబ్రవరి 1 తర్వాత కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఇన్చార్జిలుగా ఉన్నట్లయితే.. డీహెచ్హెచ్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.