Minister Farooq: పత్రికలు ప్రజా వారధులు
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:15 AM
ఎన్నో ఏళ్ల నుంచి పత్రికలు ప్రజా వారధులుగా నిలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల దృష్టికి రాని సమస్యలను సైతం గుర్తిస్తున్నాయి.
సమాజ సేవలో ‘ఆంధ్రజ్యోతి’ పాత్ర అద్వితీయం
‘అక్షరం అండగా’ సభలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్
నంద్యాల, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నో ఏళ్ల నుంచి పత్రికలు ప్రజా వారధులుగా నిలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల దృష్టికి రాని సమస్యలను సైతం గుర్తిస్తున్నాయి. ఈ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ పాత్ర అద్వితీయం..’ అని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని నందమూరినగర్లో బుధవారం నిర్వహించిన ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా..’ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’ తన దృష్టికి తీసుకురావడంతో వాటి పరిష్కారానికి కృషి చేశానని చెప్పారు. 38వ వార్డు పరిధి నందమూరి నగర్, వైఎస్సార్ నగర్లలో రూ.3కోట్ల నిధులతో రోడ్లు, కాలువలు, విద్యుత్తు స్తంభాలు, లైట్లు, తాగునీటి పైప్లైన్ తదితర పనులు చేపట్టామని వివరించారు.
నంద్యాలలో హిందువులు, ముస్లిం, క్రైస్తవులకు వేర్వేరుగా శ్మశానవాటికలు ఏర్పాటు చేయిస్తానని, ప్రజలకు రక్షణ ఉండేలా ఈ ప్రాంతంలో 4వ పట్టణ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ, డైరెక్టర్ వేమూరి ఆదిత్య రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం అభినందనీయమని ఫరూక్ కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ‘ఆంధ్రజ్యోతి’ యూనిట్ మేనేజర్ ఆకుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.