Tdp : అర్బనలో జగడం
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:41 AM
అర్బన నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర విమర్శలకు దిగారు. అభివృద్ధి, అవినీతి అంశాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సాయినగర్లోని ఓ ఆస్పత్రి వివాదంతో మొదలై.. పాత విషయాలను తవ్వుకునేదాకా వెళ్లింది. తనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేయడం వెనుక మాజీ ఎమ్మెల్యే వైకుంఠం...
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర ఆరోపణలు
అభివృద్ధి, అవినీతి అంశాలపై ఘాటు విమర్శలు
అనంతపురం క్రైం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): అర్బన నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరస్పర విమర్శలకు దిగారు. అభివృద్ధి, అవినీతి అంశాలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సాయినగర్లోని ఓ ఆస్పత్రి వివాదంతో మొదలై.. పాత విషయాలను తవ్వుకునేదాకా వెళ్లింది. తనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేయడం వెనుక మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ఆరోపించారు. కాగా, రామకృష్ణ మంచి భావాలు ఉన్న వ్యక్తి అని, ఆయనతో తాను మాట్లాడితే తప్పేమిటని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరు నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే, రాంనగర్లోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు.
నాకు రాజకీయం తెలియదు...
‘‘రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అభివృద్ధి తప్ప రాజకీయాలు చేయడం తెలియదు. సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, మా యువనేత లోకేశ సహకారంతో
ఎమ్మెల్యే అయ్యాను. నేను వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారు. మళ్లీ నాకే ఎక్కడ టిక్కెట్ ఇస్తారోనన్న భయంతో పార్టీ లైనలో ఉన్న మరో నాయకుడు బురద చల్లుతున్నారు. ఎంతటి సీనియర్లు అయినా క్రమశిక్షణ తప్పితే చర్యలు ఖాయం. నేను తప్పుచేయను. చేస్తే తలవంచుతాను. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం. నగరంలో ఏడాది కాలంలో రూ.122 కోట్లతో అభివృద్ధి చేశాను. రూ.750 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం డీపీఆర్ పంపాము. 30 ఏళ్ల డంపింగ్ యార్డ్ సమస్యను క్లియర్ చేయిస్తున్నాము. మూడు వేల టిడ్కో ఇళ్లును లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాము. సీపీఐ రామకృష్ణ నాకు బాగా తెలుసు. ఆయన ఎవరో రాసిచ్చిన స్ర్కిప్ట్ చదివినట్లున్నారు. ఎమ్మెల్యే అయ్యాక బంధువుల పేరిట, నా పేరిట సెంటు భూమి కొనలేదు. గతంలో సుగుణ చికెన దుకాణాల్లో వసూళ్లు అంటూ యల్లనూరు, పుట్లూరు వ్యక్తుల పేరుతో వాయి్సలు బయటకొచ్చాయి. ఆ ప్రాంతంలో ఎవరికి బాగా పరిచయాలు ఉన్నాయో అందరికీ తెలుసు. అస్త్ర ఆసుపత్రి ఘటనపై రాంనగర్లో ఉండే శ్రీనివాస్ చౌదరి కొందరు మీడియా వాళ్లను జడ్పీలోకి తీసుకెళ్లి బలవంతంగా మా వాళ్ల పేర్లు చెప్పించే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. డబుల్ రిజిస్ట్రేషన వ్యవహారంపై సబ్ రిజిసా్ట్రర్ను విచారించాలని జిల్లా రిజిసా్ట్రర్ను కోరాము. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. నా వద్దే వెయ్యిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నా బావమరిది అశోక్పై కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో రహంతుల్లా, మహాలక్ష్మి శ్రీనివాస్ ఎలా ఓడిపోయారో అందరికీ తెలుసు. ఇలాంటి రాజకీయాలు చేయడం నాకు తెలియదు. ఆ నాయకుడి అనుభవమంత వయస్సు కూడా నాకు లేదు. మంచి కోసం ఆయన సలహాలు ఇస్తే తీసుకుంటాను. 14 నెలలుగా నాపై కుట్రలు చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారు..’’ - ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
దగ్గుపాటీ.. తేల్చుకుందాం రా..
‘‘దగ్గుపాటీ.. నోరు అదుపులో పెట్టుకో. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా.. పోటీ చేద్దాం. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. సమాధులను ఆక్రమించిన వాళ్లు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లు కూడా నన్ను పార్టీ నుంచీ సస్పెండ్ చేయాలని అడిగారని తెలిసింది. నువ్వు అర్ధరాత్రి టిక్కెట్ తెచ్చుకున్నా నేను కలిసి తిరిగాను. చంద్రబాబు సీఎం కావాలని కష్టపడ్డాను. నీ కోసం కాదు. ఇప్పుడు ప్రెస్మీట్ పెట్టి అవాకులు, చవాకులు పేలుతున్నావు. కష్టపడినోళ్లపై బురద చల్లుతావా? మున్సిపల్ చైర్మనగా ఉన్నప్పుడు నేను అక్రమంగా ఆస్తులు సంపాయించానని అంటున్నావు. రా చర్చ పెట్టుకుందాం. నాకు ఎక్కడ అక్రమాస్తులు ఉన్నాయో లెటర్ ప్యాడ్పై రాసివ్వు. పార్టీ కోసం శ్రమించిన వాళ్లనే స్టేషన్లలో పోలీసుల చేత చితకబాదించింది నిజం కాదా? నీ దుర్నీతిపై ఆధారాలున్నా పార్టీ కోసం మౌనంగా ఉన్నాను. నా ఇంటిని బుల్డోజర్తో కొట్టిస్తానంటావా..? నేను తాలిబొట్లు తెంచానంటావా...? రాప్తాడు మర్డర్ కేసులో ముద్దాయి ఎవరు? సీపీఐ రామకృష్ణ మంచి భావాలున్న వ్యక్తి. ఆయనతో నేను మాట్లాడితే తప్పేంటి..? రాత్రి మందు తాగి మాట్లాడే వారెవరో అందరికీ తెలుసు..’’
- మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
మరిన్ని అనంతపురం వార్తల కోసం...