SP : ధర్మవరంలో తనిఖీలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:50 PM
ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు, 156 మంది సిబ్బంది ఒక్కసారిగా తనిఖీలకు దిగడంతో ధర్మవరం దద్దరిల్లింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ధర్మవరం, పెనుకొండ డీఎస్పీలు హేమంతకుమార్, నరసింగప్ప, సీఐలు, ఎస్ఐలతో కలిసి ఎస్పీ సతీష్కుమార్ బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
ఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు
85 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు సీజ్
ధర్మవరం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు, 156 మంది సిబ్బంది ఒక్కసారిగా తనిఖీలకు దిగడంతో ధర్మవరం దద్దరిల్లింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ధర్మవరం, పెనుకొండ డీఎస్పీలు హేమంతకుమార్, నరసింగప్ప, సీఐలు, ఎస్ఐలతో కలిసి ఎస్పీ సతీష్కుమార్ బుధవారం సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎస్పీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్ల ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో మాట్లాడి మంచి ప్రవర్తనలో నడుచుకునే విధంగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. తుపాకులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ప్రతి ఇంటినీ సోదా చేశారు. నంబరు ప్లేట్లు, రికార్డులు లేని వాహనాలను సీజ్ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... కార్డెన సెర్చ్లో భాగంగా ఎవరూ తప్పించుకోకుండా 16 బృందాలు ఏర్పాటుచేసి, రెండు డ్రోన కెమరాలు, బాడీవన కెమెరాలు, మొబైల్ స్కానింగ్ చెక్ డివైజ్లను వినియోగించామన్నారు. మొబైల్ స్కానింగ్ ఫింగర్ ప్రింట్ డివైజ్లు వినియోగించి, పాత నేరస్తుల డేటా సేకరించామన్నారు. ఆరుగురు రౌడీషీటర్లు, 8 మంది సస్పెక్ట్ షీట్లు కలిగిన వారిని గుర్తించి పరిశీలించామన్నారు. 25 ఏళ్ల క్రితం నేరాలు చేసిన వారు కూడా కాలనీలో ఉన్నారన్నారు. ప్రశాంతంగా బతకాలని వారికి సూచించామన్నారు. 15ఏళ్లుగా ప్రశాంత జీవనం సాగిస్తున్న వారిపై రౌడీషీట్లను తొలగిస్తామన్నారు. రాత్రి సమయాల్లో తాగి గొడవలు, అల్లర్లు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు తెరుస్తామన్నారు. నంబర్ ప్లేట్లులేని 85 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశామన్నారు. ఇందిరమ్మ కాలనీలో 4 సీసీ కెమెరాలు ప్రస్తుతానికి ఉన్నాయనీ, మరో 10 ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....