Share News

Medaram: మేడారంలో తిరుగువారం పండగ నేడు

ABN , Publish Date - Feb 28 , 2024 | 08:12 AM

ములుగు జిల్లా: సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజా మందిరాలకు తాళాలు వేస్తారు.

Medaram: మేడారంలో తిరుగువారం పండగ నేడు

ములుగు జిల్లా: సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. దీంతో మేడారం (Medaram) మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పూజా మందిరాలకు తాళాలు వేస్తారు. కాగా తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది.

కాగా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజుల పాటు కన్నుల పండువగా సాగి అత్యంత వైభవంగా ముగిసింది. జాతరలో కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో జాతర శనివారం పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనమయ్యారు. వన దేవతలు గద్దెలు విడిచే సమయంలో మేడారంలో వర్షం కురవడం విశేషం. వర్షాన్ని శుభ సూచకంగా భావించిన భక్తులు జయజయ ధ్వానాలు చేస్తూ అమ్మలకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ జాతరకు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఇంఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.

మేడారం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీమంత్రులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలు మేడారం జాతరకు హాజరయ్యారు. అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 08:13 AM