Share News

BJP: మేడిగడ్డకు వెళ్ళకూడదని బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయం

ABN , Publish Date - Feb 13 , 2024 | 08:07 AM

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. ఈ పర్యటనకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రభుత్వం మేడిగడ్డకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు సమాన దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది.

BJP: మేడిగడ్డకు వెళ్ళకూడదని బీజేపీ ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. ఈ పర్యటనకు దూరంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రభుత్వం మేడిగడ్డకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు సమాన దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. మేడిగడ్డను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రాజకీయం కోసం వాడుకుంటున్నాయని కమలం పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం తీరును అసెంబ్లీలో ఎండగట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

కాగా మేడిగడ్డ పర్యటనకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలూ వెళుతుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వెళ్లడం లేదు. మేడిగడ్డ పర్యటనకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లడం లేదంటూ బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై బీఆర్‌ఎస్‌ పార్టీ నల్లగొండలో భారీ బహిరంగసభ పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లనున్నారు. మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వ ఆహ్వానం మేరకు మేడిగడ్డ వెళుతున్నారు. అయితే ఏడుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు, ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఒక్కరు వెళ్తున్నారు. ఇక సీపీఐ ఏకైక సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా వెళుతున్నారు. అధికార, ప్రతిపక్షాలు మంగళవారమే నదీ జలాలకు సంబంధించి పోటీ కార్యక్రమాలు తలపెట్టడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. కృష్ణా జలాలపై నల్లగొండలో కేసీఆర్‌ సభను తలపెడితే.. సీఎం రేవంత్‌ మేడిగడ్డ పర్యటన పెట్టడం చర్చనీయాంశమైంది.

Updated Date - Feb 13 , 2024 | 08:07 AM