Share News

Loksabha Elections బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా..!

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:29 PM

మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగడం లేదని సదరు సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది.

Loksabha Elections బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా..!

మనం ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ( BRS Chief) (KCR) తోపాటు ఆయన ఫ్యామిలీ విషయంలో జరిగిందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బరిలో దిగడం లేదని సదరు సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా వైరల్ అవుతోంది. తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారాన్ని అందుకున్నాం.. ఇక ముచ్చటగా మూడోసారి కూడా అధికారాన్ని అందుకుంటాం. ఇది 100 పర్సెంట్ పక్కా. ఇక దేశ రాజధాని హస్తినలో ప్రధాని పీఠం సైతం హస్తం గతం చేసుకోవడమే తరువాయి అన్నట్లుగా కేసీఆర్ వ్యవహించారు.


ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి రాజకీయంగా కారు పార్టీని దేశవ్యాప్తంగా కదం తొక్కేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా ఏపీలో పార్టీ అధ్యక్షుడిని నియమించడంతోపాటు గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. అలాగే మహారాష్ట్ర రాజకీయాల్లో సైతం కారు పార్టీ కీలకంగా వ్యవహరించేలా పావులు కదిపారు. కానీ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు హస్తం పార్టీకి పట్టం కట్టడారు. దీంతో గులాబీ బాస్ కేసీఆర్ ఖంగుతిన్నారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వెంట కోటరిగా మసలిన నేతలంతా.. బీబీ పాటిల్, కడియం శ్రీహరి, కేకే, బొంతు రామ్మోహన్ వగైరా వగైరా అంతా.. టోకుగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం తీసుకున్నారు.

ఇంతలో లోక్‌సభ ఎన్నికలు రానే వచ్చాయి. అయితే ఆ పార్టీ నుంచి బరిలో దింపేందుకు లోక్‌సభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏదురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వరంగల్ ఎంపీ టికెట్ కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు బీఆర్ఎస్ కేటాయిస్తే.. తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం లేదంటూ కేసీఆర్‌కే లేఖాస్త్రాం సైతం సంధించింది. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగింది.


మరోవైపు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత.. సరిగ్గా ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు పోన్ ట్యాపింగ్ వ్యవహారంతోపాటు ఇతరత్ర ఆరోపణలు కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ను చుట్టుముట్టి ఉన్నాయి. ఇక కేసీఆర్ మరో మేనల్లుడు సంతోష్ రావు రాజ్యసభ పదవి కాలం సైతం ముగిసిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి రాజకీయంగా దేశవ్యాప్తంగా కారు స్టిరింగ్ తిప్పుదామని కేసీఆర్ భావించారు. కానీ ఎన్నికల వేళ.. ఆయన ఫ్యామిలీలోని ఒక్కరు కూడా ఎన్నికల బరిలో నిలబడం సంగతి దేవుడెరుగు.. ఉభయ సభల్లో సైతం ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.

2001లో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. 2004లో ఆయన కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక 2009లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 2014లో మెదక్ లోక్‌సభ‌తోపాటు గజ్వేల్ ఎమ్మెల్యేగా సైతం పోటీ చేశారు. అయితే మళ్లీ వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం.. మెదక్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. ఇక 2014లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కవిత ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే.. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపూరి అర్వింద్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. దాంతో కేసీఆర్ ఫ్యామిలీలోని వారు లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించే వారు లేకుండా పోయారు.


ఇక కేసీఆర్ మేనల్లుడు జోగినిపల్లి సంతోష్ రావు.. రాజ్యసభ పదవి కాలం నిన్నటితో అంటే.. 2024, ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. సరిగ్గా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఎన్నికల బరిలో దిగడం కానీ.. రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించడం కానీ లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెండు దశాబ్దాల పాటు కేసీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ రాజకీయంగా ఒక చక్రం తిప్పింది.

అయితే వచ్చే ఈ అయిదేళ్లలో పార్లమెంట్‌లో ఈ ఫ్యామిలీ ప్రాతినిధ్యం వహించకుండా ఉన్నట్లు అయింది. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ జెండాను రెపరెపలాడించిన కేసీఆర్.. అదే పార్టీని బీఆర్ఎస్‌ మార్చి.. ఎన్నికలకు వెళ్లడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చిన ఇదే కేసీఆర్.. పార్టీ పేరు మళ్లీ పాత పద్దతిలో అంటే టీఆర్ఎస్ అని పేరు మారుస్తారా? అనే ఓ సందేహం అయితే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మరిన్నీ తెలంగాణ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

KTR: నేతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష..?: కేటీఆర్

Telangana: ఈ సమ్మర్‌లో బీరు ప్రియులకు కష్టమే..!

Updated Date - Apr 04 , 2024 | 04:30 PM