Share News

Venu Gopal: ప్రముఖ రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌ కన్నుమూత

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:33 AM

తెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం... కవి, కథకుడు, నవలా రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌(72) సోమవారం కన్నుమూశారు.

Venu Gopal: ప్రముఖ రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌ కన్నుమూత

  • కర్నూలు స్వగృహంలో అనారోగ్యంతో మృతి

  • సోమవారమే పూర్తయిన అంత్యక్రియలు

కర్నూలు(కల్చరల్‌), ఆగస్టు 19: తెలుగు సాహితీ వినీలాకాశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆధునిక సాహితీదిగ్గజం... కవి, కథకుడు, నవలా రచయిత కాశీభట్ల వేణుగోపాల్‌(72) సోమవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్నూలు నగరంలోని రెవెన్యూ కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1974లో ఆంధ్రపత్రికలో ‘రంగనాయకి లేచిపోయింది’ అనే కథతో కాశీభట్ల తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత అనేక కవితలు రాశారు. ‘నేను-చీకటి’ అనే నవలతో వెలుగులోకి వచ్చారు. ఆయన రచనలు ‘ఘోష’, ‘తపన’, ‘దిగంతం’ ‘మంచు-పువ్వు’, ‘తెరవని తలుపులు’, ‘అసత్యానికి ఆవల’, ‘సంగతం’ వంటివి విమర్శకుల ప్రశంసలు పొందాయి.


వినూత్న కథనాలు, కొత్తదనంతో కనిపించే పాత్రలు, ఆకట్టుకునే రచనా శైలి ఆయన స్వంతం. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆయన రచనలు నవ్య కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిశాయి. ఆయన తన కలం ద్వారా మానవ సంబంధాలను, మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న కోణాలను, మనుషుల మధ్య ఉన్న అంతరాలను సునిశితంగా పరిశీలించి రాసేవారు. సుమారు 12కు పైగా నవలలు, వందకు పైగా కథలు రాశారు. కాశీభట్ల వేణుగోపాల్‌ 1952 జనవరి 2న కర్నూలులో జన్మించారు. తండ్రి ఎల్లప్ప శాస్త్రి, తల్లి హనుమాయమ్మ. కర్నూలు బీక్యాంపు బాలుర పాఠశాల్లో హైస్కూల్‌ విద్య, ఉస్మానియా కళాశాలలో కళాశాల విద్య పూర్తి చేశారు.


‘మొదట్లో అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు ఆకర్షితుడినైనా... విశ్వసాహిత్యాన్ని చదివే క్రమంలో వాటి నుంచి బయటపడ్డాను’ అని ఒక సందర్భంలో ఆయన చెప్పుకొచ్చారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన కాశీభట్ల... జీవితాన్వేషణలో వారణాసి, లక్నోలో కొంతకాలం ఉన్నారు. పదునైన భాషతో కూడిన కాశీభట్ల రచనా శైలి అన్ని వర్గాలను ఆకట్టుకునేది. పెద్దగా ఎవరూ స్పృశించని, సాహసించని స్త్రీ పురుష సంబంధాల్ని, పురుషుడి చీకటి ఆలోచనల్నీ, నిషేధిత సంబంధాలను తెలుగు సాహిత్యంలోకి తెచ్చి తనకంటు ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.


‘ఒక బహుముఖం’ అనే కవితా సంపుటికి మంచి ప్రాచుర్యం లభించింది. 1996లో కర్నూలులో ‘తానా’ సంస్థ నుంచి పురస్కారం అందుకున్నారు. వేణుగోపాల్‌ మృతి విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, సాహిత్యాభిమానులు ఆయన స్వగృహానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం కాశీభట్ల అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - Aug 20 , 2024 | 04:33 AM