Share News

TS News: ‘పార్టీలో చెత్తంతా పోయింది’

ABN , Publish Date - Mar 29 , 2024 | 04:17 PM

పార్టీలోని చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లు మాత్రమే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

TS News: ‘పార్టీలో చెత్తంతా పోయింది’

జోగిపేట,మార్చి29: పార్టీలోని చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లు మాత్రమే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి (pocharam srinivas reddy) స్పష్టం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జోగిపేటలో ఆంధోల్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

పదవులు, అధికారం, వ్యాపారాల కోసం పార్టీలోకి వచ్చిన స్వార్ధపరులు, మోసకారులే ఈ విధంగా పార్టీ మారుతున్నారన్నారు. అయితే మోసకారుల జాబితా రాస్తే అందులో మొదటి పేరు బిబీ పాటిల్‌దేనని ఆయన స్పష్టం చేశారు. ఇక మొదటి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు నేటికి బీఆర్ఎస్‌ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 100 పథకాల గురించి చెప్పొచ్చని.. కానీ బీజేపీ అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పండంటూ పార్టీ శ్రేణులు ఎదుట పోచారం సవాల్ విసిరారు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదని పోచారం మండిపడ్డారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy)సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలంతా.. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకొంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేకేతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మీ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

అలాగే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి( kadiyam srihari)తో పాటు ఆయన కుమార్తె కడియం కావ్య (kadiyam Kavya)సైతం హస్తం పార్టీకి స్నేహ హస్తం అందించారు. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. అయితే తాను పోటీ చేయడం లేదని కడియం కావ్య ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసి మరీ స్పష్టం చేసింది. ఇటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకోవడంతో.. పోచారం శ్రీనివాసరెడ్డిపై విధంగా స్పందించారు.

మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

‘ఆ పాపాలే కేసీఆర్‌కు తగిలాయి’

టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో భువనమ్మ

Updated Date - Mar 29 , 2024 | 04:17 PM