Share News

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌

ABN , Publish Date - Mar 13 , 2024 | 08:35 AM

సూర్యాపేట: హుజూర్‌నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్‌ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నార’ని హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

Saidireddy: మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్‌ వాయిస్‌ రికార్డ్‌ వైరల్‌

సూర్యాపేట: హుజూర్‌నగర్ బీఆర్ఎస్ (BRS) మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి (Ex MlA Saidireddy) టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ (Teleconference Voice Record) సోషల్ మీడియా (Social Media) లో వైరల్ (Viral) అయింది. ‘రాష్ట్రంలో బీజేపీ (BJP) పుంజుకుంటోంది. బీఆర్‌ఎస్‌ (BRS) పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నార’ని హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన సైదిరెడ్డి నేరేడుచర్ల ముఖ్య కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చెప్పకుండా వెళ్లడం తప్పేనని, అందుకు క్షమించాలని, కానీ తన వెంట ఉంటారనే నమ్మకంతోనే వెళ్లానని వారికి వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వాయిస్‌ రికార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సైదిరెడ్డి సంభాషణ ఇలా సాగింది.

‘‘ఢిల్లీ రావాలని బీజేపీ ముఖ్యుల నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడున్న పెద్దలు కండువా కప్పుకోవాలన్నారు. పార్లమెంట్‌ టికెట్‌ నీకే ఖరారవుతుందన్నారు. నేను ఎవరితో చెప్పలేదని, కార్యకర్తలతో మాట్లాడాలని చెప్పినా వారు వినిపించుకోలేదు. అమిత్‌ షా ఆధ్వర్యంలో ఇప్పుడే పూర్తవుతుంది. ఇప్పుడు నువ్వు కండువా కప్పుకోకపోతే రాష్ట్రంలో బీజేపీ పరువు పోతుందని ఒత్తిడి తెచ్చారు. మీరంతా నా వెంటే ఉంటారు, నన్ను అర్థం చేసుకుంటారని నేను పార్టీ మారాల్సి వచ్చింది. మీకు తెలుసు నేను బీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏందో తెలుసు. ఒక్క సర్పంచ్‌ లేడు. నేను వచ్చాకనే 120 సర్పంచ్‌లు, 17 పీఏసీఎస్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిపించుకున్నాం. యువతకు ఏమీ చేయలేకపోయానని బాధ ఉంది. ఇప్పుడు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉంది. మళ్లీ మోదీనే వస్తాడు. అప్పుడు మనం యూత్‌కు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలు తీసుకురావచ్చని ఆలోచించిన. ఇన్నాళ్ల చరిత్రలో ఇంత క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న మోదీలాంటి నాయకుడు లేడు. ఒక్క స్కాం లేదు. ఆయనకు కుటుంబం లేదు. దేశమే ఆయనకు కుటుంబం. ఆయన సపోర్టు ఉంటే మనకు మంచిదని ఆలోచించిన. వాళ్లు నన్ను కావాలని కోరుకోవడం నాకు మంచిదవుతుందనుకున్న. రేవంత్‌ రెడ్డిని దింపాలని కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే కోరుకుంటున్నరు. అప్పుడు మనోళ్లే వారికి సహాయం చేసే అవకాశం ఉంది. నేను ఒక్కన్ని పోయి ఏం చేస్త.. మీరందరూ నా వెంట లేకపోతే! ఉంటారనే అనుకున్న. పార్లమెంటుకు పోటీ చేయాలంటే బీఆర్‌ఎస్‌ వాళ్లు చాలామంది భయపడుతున్నారు. చెప్పకపోవడం తప్పే, రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మారకపోతే ఆగమైతం అని ఆలోచించిన. నేను చెప్పకపోయినా మా సైదన్న అని నా వెంట ఉంటరనే వెళ్లాల్సి వచ్చింది. ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం కదా అని కొందరు అంటున్నరు. నేను దర్గాలకు ఎక్కువగా వెళ్లిన. వారికి నచ్చచెబుతా. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పకపోవడం తప్పే. నన్ను క్షమించండి. టీడీపీ కనుమరుగైపోయింది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పరిస్థితి అర్థం కావడంలేదు. రాష్ట్రంలో బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ పుంజుకుంటోంది. మీకు నా మీద కోపం లేదని నేను అనను, కోపం ఉన్నా నాకు సపోర్టు చేస్తరు.. చేయండి. మీ బలం ఉంటదని ఆలోచించిన. అందరూ నా వెంట వస్తారని ఆశిస్తున్న. మీ బలం ఉంటదనే నేను పోయిన మీరు లేకుంటే నాకు విలువ లేదు. నేను లేను. రెండు మూడు రోజుల్లో హుజూర్‌నగర్‌కు వచ్చి మీటింగ్‌ పెడ్తా, నావెంటే ఉండాలి. జై తెలంగాణ’’ అని సైదిరెడ్డి సంభాషణ ముగించారు.

Updated Date - Mar 13 , 2024 | 08:35 AM