Mahindra University: మహీంద్ర యూనివర్సిటీలో ‘స్కూల్ ఆఫ్ డిజైన్’
ABN , Publish Date - Jul 19 , 2024 | 04:30 AM
మహీంద్రా యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ విభాగాన్ని వర్సిటీ వీసీ మేడూరి యాజులు గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
నూతన విభాగాన్ని ప్రారంభించిన వైస్చాన్స్లర్
హైదరాబాద్ సిటీ, జూలై 18(ఆంధ్రజ్యోతి): మహీంద్రా యూనివర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ విభాగాన్ని వర్సిటీ వీసీ మేడూరి యాజులు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ డిజైన్ రంగంలో భవిష్యత్తు ఉద్యోగాలకు, వాణిజ్యానికి యువతను సిద్ధం చేసేందుకు స్కూల్ ఆఫ్ డిజైన్ దోహదపడుతుందన్నారు. ఇటలీకి చెందిన పినిన్ఫరినా డిజైన్ అకాడమీ, ఐఐటీ ముంబైలోని షెనోయ్ ఇన్నోవేషన్ స్టూడియో ఇందులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయని చెప్పారు.
ఆగస్టు 15 నుంచి మొదటి అకడమిక్ సెషన్ ప్రారంభమవుతుందని, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బి.డిజైన్) కోర్సును ఈ ఏడాది 30 సీట్లతో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలను, మనస్తత్వాన్ని విద్యార్థులలో పెంపొందించడమే స్కూల్ ఆఫ్ డిజైన్ లక్ష్యమని దాని వ్యవస్థాపక డీన్ ప్రొఫెసర్ బీకే చక్రవర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మహీంద్ర యూనివర్సిటీ అడ్మిషన్ల విభాగాధిపతి రాకేశ్ శ్రీధరన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.