Hyderabad: ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం..
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:23 AM
మాదిగ రిజర్వేషన్ పోరాటం అంటే మానవ హక్కుల పోరాటమే అని పలువురు మాదిగ నేతలు పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ ఉద్యమాన్ని చీల్చే కుట్రలను ఛేదించాలని వారు పిలుపునిచ్చారు.

మాదిగ ‘దండోరా’ ముప్పై వసంతాల వేడుకల్లో వక్తలు
హైదరాబాద్ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మాదిగ రిజర్వేషన్ పోరాటం అంటే మానవ హక్కుల పోరాటమే అని పలువురు మాదిగ నేతలు పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ ఉద్యమాన్ని చీల్చే కుట్రలను ఛేదించాలని వారు పిలుపునిచ్చారు. మాదిగ హక్కుల దండోరాకు ముప్ఫై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ దండోరా నాయకులు మాట్లాడుతూ.. అవిభాజ్య ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మూడు దశాబ్దాల కిందట మొదలైన ఈ ఉద్యమం మాదిగల అస్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని సమాజానికి చాటిందని కొనియాడారు.
హిందూత్వ శక్తుల కౌగిలిలో మందకృష్ణ మాదిగ ఒదగడం బాధాకరమని అన్నారు. మాదిగలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సదస్సులో మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని తెలిపారు. మాదిక హక్కుల పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రజా గాయని విమలక్క, ప్రొఫెసర్లు ఆడమ్, మల్లేశం, ఇటిక్యాల పురుషోత్తం తదితరులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.