Hyderabad: హైదరాబాద్ను కమ్మేసిన మంచు దుప్పటి.. నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..
ABN , Publish Date - Dec 29 , 2024 | 08:14 AM
తెలంగాణ: ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పింది. అయినా మేఘాలు తక్కువగానే ఉంటాయని వెల్లడించింది.

హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ మంచుముద్దగా మారిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఆదివారం మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలైనా పొగమంచు ఏమాత్రం వీడలేదు. అర్దరాత్రి నుంచి వర్షం కురిసినట్లుగా మంచు కురుస్తోంది. నవంబర్ నెల నుంచే చలి తీవ్రత పెరగడం ప్రారంభమైనా పొంగమంచు పెద్దగా కనిపించలేదు. ఆదివారం మాత్రం పొగమంచు భారీగా కురిసింది. నేడు సెలవు దినం కావడం, పొగమంచు చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడంతో నగరవాసులు పలువురు ఆసక్తిగా తిలకించారు. వాకింగ్ చేస్తూ సరదాగా ఆస్వాదించారు. ఏడాది తర్వాత ఇంత పెద్దమెుత్తంలో మంచు పడడాన్ని చూసి హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఆదివారం ఇదీ పరిస్థితి..
మరోవైపు నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. చలి తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పింది. అయినా మేఘాలు తక్కువగానే ఉంటాయని వెల్లడించింది. అలాగే నేడు ఏపీ, తెలంగాణలో పొగమంచు బాగా పెరిగి ఉదయం, సాయంత్రం భారీగా కురుస్తుందని పేర్కొంది. పగటిపూట మెుత్తం ఎండ ఉన్నప్పటికీ ఉదయం, రాత్రి వేళ చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం గంటకు 14కి.మీ. వేగంతో చలిగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో గంటకు 9 కి.మీ. వేగంతో వీస్తాయని వెల్లడించింది. మరోవైపు బంగాళాఖాతంలో గంటకు 31కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది. అయితే శ్రీలంక తూర్పు వైపు అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో గాలులన్నీ అటు వైపు మళ్లుతున్నట్లు తెలిపింది. తెలంగాణలో పగటి వేళ 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే అర్దరాత్రి సమయంలో ఏపీలో 21, తెలంగాణలో 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుందని పేర్కొంది. ఏపీ గాలుల్లో తేమ శాతం 40 నుంచి 70గా ఉంటుందని, తెలంగాణలో అది 40 నుంచి 50 శాతంగా ఉంటుందని వెల్లడించింది. అయితే పొగమంచు, చలి తీవ్రత కారణంగా ప్రజలు రాత్రి వేళ జాగ్రత్తలు పాటించాలని భారత వాతావరణ శాఖ సూచించింది.