Hussain Sagar: చెరువుకు రక్ష హైడ్రా త్రిముఖ వ్యూహం!
ABN , Publish Date - Aug 13 , 2024 | 03:36 AM
ముత్యాలనగరం అనే కాదు.. మన హైదరాబాద్కు లేక్ సిటీగానూ పేరుంది! నాలుగు దశాబ్దాల క్రితం హుస్సేన్సాగర్ సహా నగరం వ్యాప్తంగా నీటితో కళకళలాడిన చెరువులన్నీ కూడా కాలక్రమేణా కబ్జాలకు గురై కుచించుకు పోతుండటంతో హైదరాబాద్ ఇప్పుడు ‘లేక్ లెస్ సిటీ’గా మారుతోంది.
ఆక్రమణలు దశలవారీగా కూల్చివేత.. మున్ముందు కట్టడి
నీటి వనరుల పునరుజ్జీవానికి పక్కా ప్రణాళిక అమలు
హుస్సేన్సాగర్ సహా హైదరాబాద్లో అన్నిచోట్లా కబ్జాలే
చెరువుల్లో 20 నుంచి 90 శాతం వరకు తగ్గిన విస్తీర్ణం
దిగ్ర్భాంతికి గురిచేస్తున్న ఎన్ఆర్ఎస్సీ నివేదిక
ఎఫ్టీఎల్, బఫర్జోన్లో నిర్మాణాలను కూల్చేస్తాం
అనుమతులిచ్చిన అధికారులు, ప్లాట్లు చేసినవారిపై కేసులు
త్వరలో హైడ్రా పోలీస్స్టేషన్: కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ముత్యాలనగరం అనే కాదు.. మన హైదరాబాద్కు లేక్ సిటీగానూ పేరుంది! నాలుగు దశాబ్దాల క్రితం హుస్సేన్సాగర్ సహా నగరం వ్యాప్తంగా నీటితో కళకళలాడిన చెరువులన్నీ కూడా కాలక్రమేణా కబ్జాలకు గురై కుచించుకు పోతుండటంతో హైదరాబాద్ ఇప్పుడు ‘లేక్ లెస్ సిటీ’గా మారుతోంది. ఎక్కడ చూసినా ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఇప్పుడన్నీ కాలనీలు, బస్తీలే కనిపిస్తున్నాయి. హుస్సేన్సాగర్ వాస్తవ విస్తీర్ణం 5.97 చదరపు కిలోమీటర్లయితే ప్రస్తుత విస్తీర్ణం 4.71 చదరపు కిలోమీటర్లే. సుమారు 1.25 చ.కిమీ.ల మేర అంటే 310 ఎకరాల మేర (21 శాతం) హుస్సేన్ సాగర్ ఆక్రమణలకు గురైందన్నమాట! సరూర్నగర్ చెరువేమో 56శాతం, ఈసీఐఎల్ సమీపంలోని మిర్యాలగూడ చెరువు ఏకంగా 90శాతం మేర కబ్జాలపాలయ్యాయి.
ఇవే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 185 చెరువులు, ఓఆర్ఆర్ వరకు ఉన్న 400 చెరువులదీ ఇదే దైన్యం. వాస్తవ విస్తీర్ణంతో పోల్చితే చెరువుల్లో చాలామటుకు 20 నుంచి 90శాతం దాకా ఆక్రమణలకు గురయ్యాయనేది దిగ్ర్భాంతికరమైన వాస్తవం! 1979 నుంచి 2023 వరకు అంటే.. 44 ఏళ్లలో నగర పరిఽధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎ్ససీ) ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం, ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా ఝళిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. చెరువులు, పార్కుల పరిరక్షణ కోసం త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్లనుంది.
చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో జరిగిన అక్రమ కట్టడాలనే కాకుండా ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఏళ్ల క్రితమే అనుమతులతో వెలిసిన భవనాలనూ చట్ట ప్రకారం కూల్చేస్తామని, మున్ముందూ అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తామని, చెరువులు, కుంటలను వాటి సహజస్థితికి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తాం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్రమణదారులతోపాటు.. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చిన అధికారులపై, అక్రమ నిర్మాణాల్లో భాగంగా ప్లాట్లు చేసి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు బుద్ధభవన్లో మీడియాతో హైడ్రా కార్యాచరణపై ఆయన మాట్లాడారు. ’చెరువుల పక్కన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లు ప్రజలు కొనుగోలు చేయొద్దు.
మున్ముందైనా వాటిని కూల్చివేస్తాం. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి నిర్మాణాలు ఏమైనా ఉంటే సమాచారమివ్వండి’ అని కోరారు. ఈ సందర్భంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎ్ససీ) నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నాలుగున్నర దశాబ్దాల్లో నగరంతోపాటు ఔటర్ వరకు ఉన్న చాలా చెరువుల విస్తీర్ణం తగ్గిందని.. ఉన్న వాటినైనా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించడంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం చాలా సీరియ్సగా ఉందని.. ఆక్రమణదారులు ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మూడు జోన్లు.. పలు సర్కిళ్లు..
ఆక్రమణలపై త్వరిగతిన చర్యలు తీసుకునేందుకు హైడ్రాను మూడు జోన్లుగా, అవసరాన్ని బట్టి సర్కిళ్లుగా విభజిస్తామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సంస్థకు 3,500 మంది సిబ్బంది అవసరం ఉందని, ప్రభుత్వ అనుమతితో వారిని సమకూర్చుకుంటామని చెప్పారు. ఆక్రమణల తొలగింపునకు క్షేత్రస్థాయిలో 72 బృందాలుంటాయని.. ఈ మేరకు పట్టణ ప్రణాళిక, విపత్తుల నిర్వహణ విభాగాలు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటామని పేర్కొన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. ఏసీపీ స్థాయి అధికారి, ఐదు నుంచి ఆరుగురు సీఐలు, ఇతర సిబ్బంది ఉంటారని.. అవసరమైతే మున్ముందు పోలీస్ స్టేషన్లను మూడు నుంచి నాలుగుకు పెంచుతామని చెప్పారు
ఇవీ ఇప్పటిదాకా కూల్చాం
జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్, బంజారాహిల్స్లోని మిథిలా కాలనీ, లోటస్ పాండ్ పార్కు, గాజుల రామారం, బుమ్రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఆక్రమణలపై హైడ్రాకు రోజూ 40 నుంచి 50 ఫిర్యాదులొస్తున్నాయని,. క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చందానగర్ ఈర్ల చెరువు ఎఫ్టీఎల్లో భవన నిర్మాణానికి జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం అనుమతులిచ్చిందని చెబుతూ చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే ఇచ్చిన లే అవుట్ల అనుమతులు రద్దు చేయాలని హెచ్ఎండీఏకు లేఖ రాశామని చెప్పారు.
ఎఫ్టీఎల్, బఫర్జోన్ వివరాలన్నీ యాప్లో..
చెరువుల ఆక్రమణలు జరగకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకూ సాంకేతికంగా చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్లాట్లు/ఇళ్లు కొనేందుకు వెళ్లిన వ్యక్తులు తామున్న స్థలం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా? అన్నది తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందిస్తామని చెప్పారు. ఆ యాప్ ఓపెన్ చేస్తే.. వాళ్లున్న ప్రాంతం దేని పరిధిలో ఉందనేది తెలిసిపోతుందని వివరించారు.