Share News

Delhi Liquor Case: నేడు సుప్రీంలో పిటేషన్ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్..

ABN , Publish Date - Mar 18 , 2024 | 07:22 AM

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేయడాన్ని కవిత భర్త అనిల్ సవాల్‌ చేస్తూ సోమవారం సుప్రీం కోర్టులో పిటేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పెటేషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది.

Delhi Liquor Case: నేడు  సుప్రీంలో పిటేషన్ దాఖలు చేయనున్న కవిత భర్త అనిల్..

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) అధికారులు అరెస్టు చేయడాన్ని కవిత భర్త అనిల్ (Anil) సవాల్‌ చేస్తూ సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటేషన్ (Petition) దాఖలు చేయనున్నారు. అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పెటేషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. కాగా ఈడీ కార్యాలయంలో కవితను రెండో రోజు సోమవారం అధికారులు విచారించనున్నారు. నిన్న కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను కేటీఆర్‌, హరీష్, భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు తదితరులు కలిశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. 7 రోజుల కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఈడీ రంగంలోకి దిగింది. కవిత కస్టడీకి సంబంధించి సంచలన విషయాలను ఈడీ రిలీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితనే కీలక వ్యక్తి.. ఈమె కుట్రదారు, లబ్ధిదారు అని ఈడీ తేల్చి చెప్పేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఈడీ స్పష్టం చేసింది. ఈ రెండు విషయాలే కాదు.. కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలే ఉన్నాయి.

నిన్న కవితపై అధికారుల ప్రశ్నల వర్షం

మద్యం కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న కవితను ఏడు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ.. దర్యాప్తులో భాగంగా తొలిరోజు ఆమెను సుదీర్ఘంగా విచారించింది. ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ మీనా నేతృత్వంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి స్పష్టత రావాల్సిన అంశాలపై ఆమె నుంచి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇతరులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవితను వివరణ కోరినట్లు సమాచారం. అలాగే.. ముడుపులు ఎలా చేతులు మారాయన్న అంశంతో పాటు ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో ఆమె పాత్రపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కవిత వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు.

కాగా.. కస్టడీలో కవితను రోజూ కుటుంబ సభ్యులు కలిసేందుకు కోర్టు అనుమతించడంతో ఆమె భర్త అనిల్‌కుమార్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్‌ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌ రెడ్డి, కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు ఉన్నారు. అయితే అధికారులు అనిల్‌, కేటీఆర్‌, హరీశ్‌ను మాత్రమే లోనికి అనుమతించారు. వారు కవితతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అధికారుల దర్యాప్తు తీరు గురించి వారు కవిత వద్ద ఆరా తీసినట్లు సమాచారం. అలాగే.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఆమెను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ సోమవారం పిటిషన్‌ వేసే అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాగా గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుండడంతో అదేరోజు కోర్టు దృష్టికి తీసుకెళితే సరిపోతుందన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో వారు బయటికి వచ్చి.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.

Updated Date - Mar 18 , 2024 | 07:24 AM