GHMC: జీహెచ్ఎంసీ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు ఔట్.. విధులకు రావొద్దని కమిషనర్ ఆదేశాలు
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:39 AM
ఉద్యోగ విరమణ చేసినా విధుల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ(GHMC) నుంచి తొలగించారు. మార్చి 1వ తేదీ నుంచి విధులకు రావొద్దని కమిషనర్ రోనాల్డ్ రోస్(Commissioner Ronald Rose) ఆదేశాలు జారీ చేశారు.
- ఎన్నికల అనంతరం మరికొందరికి ఉద్వాసన
హైదరాబాద్ సిటీ: ఉద్యోగ విరమణ చేసినా విధుల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ(GHMC) నుంచి తొలగించారు. మార్చి 1వ తేదీ నుంచి విధులకు రావొద్దని కమిషనర్ రోనాల్డ్ రోస్(Commissioner Ronald Rose) ఆదేశాలు జారీ చేశారు. దీంతో 40 మందికిపైగా రాజీనామా చేశారు. విరమణ చేసిన ఉద్యోగులు వివిధ విభాగాల్లో కొనసాగుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో పలు విభాగాల్లో అధికారులనూ తొలగించారు. సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అయి విధుల్లో కొనసాగుతున్న అధికారులు, ఉద్యోగులు 45 మంది ఉన్నారని కమిషనర్ నివేదిక పంపారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ రిటైర్ ఉద్యోగుల కొనసాగింపుపై పాలకమండలి సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన కమిషనర్ 45 మందిని తొలగిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే రోనాల్డ్రోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కొందరు అధికారులు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కొనసాగుతారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.