Telangana: పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. జగదీష్ రెడ్డి డిమాండ్
ABN , Publish Date - Apr 07 , 2024 | 04:32 PM
పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) డిమాండ్ చేశారు.
![Telangana: పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. జగదీష్ రెడ్డి డిమాండ్](https://media.andhrajyothy.com/media/2024/20240407/jagadish_320501e2ae.jpg)
హైదరాబాద్: పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. "తెలంగాణ నుంచి కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని ఫిరాయింపుల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే స్పీకర్ సమయం ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తేవాలనుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి.
ప్రజలకు సాగు,త్రాగునీరు, కరెంటు ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలం అయింది. మహిళలకు నెలకు 2,500 ఇస్తామని మోసపూరిత హామీ ఇచ్చి.. దాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో మహిళలకు లక్ష రూపాయలు ఇస్తామని చెబుతోంది. రైతులను ఆదుకోవాలని కేసీఆర్ మాట్లాడటం తప్పా? పదేళ్లు కష్టపడి సాధించిన ప్రగతిని కాంగ్రెస్ వంద రోజుల్లో నాశనం చేసింది. ప్రజలకు నీళ్లు ఇవ్వని సీఎం రేవంత్, మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలి. ఢిల్లీకి కప్పం కట్టి తెలంగాణలో కుర్చీని కాపాడుకోవాలని అనుకుంటున్నారు. కేసీఆర్ ఎండలో రైతుల కష్టాలు చూడటానికి వెళ్తే సీఎం ఐ.పి.ఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్లారు" అని జగదీష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.