Share News

Kesineni Brothers: ఏమండోయి నాని గారు.. ఏమండోయి చిన్ని గారు..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:41 PM

ఏవండోయ్ నాని గారు.. ఏమండోయ్ చిన్ని గారు అనే సినిమా పాట గుర్తుంది కదా.. ఇప్పుడది విజయవాడ వేదికగా రియల్‌గా పాడేసుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. నాని, చిన్ని బ్రదర్స్ ఇద్దరూ వర్సెస్ అయ్యారు. విజయవాడ నుంచి ఒకరు టీడీపీ తరఫున.. మరొకరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో నాని, చిన్నీ పేర్లు ఏపీలో మార్మోగుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. విజయవాడ అంటే.. విద్యలకే వాడే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సైతం కేరాఫ్ అడ్రాస్.

Kesineni Brothers: ఏమండోయి నాని గారు.. ఏమండోయి చిన్ని గారు..!

ఏవండోయ్ నాని గారు.. ఏమండోయ్ చిన్ని గారు అనే సినిమా పాట గుర్తుంది కదా.. ఇప్పుడది విజయవాడ వేదికగా రియల్‌గా పాడేసుకుంటున్నారు జనాలు. ఎందుకంటే.. నాని, చిన్ని బ్రదర్స్ ఇద్దరూ వర్సెస్ అయ్యారు. విజయవాడ నుంచి ఒకరు టీడీపీ తరఫున.. మరొకరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో నాని, చిన్నీ పేర్లు ఏపీలో మార్మోగుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే.. విజయవాడ అంటే.. విద్యలకే వాడే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయానికి సైతం కేరాఫ్ అడ్రాస్. అలాంటి విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థి ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఈ సారి జరగనున్న ఎన్నికలు.. అదీకూడా విజయవాడలో గతానికి భిన్నంగా జరగబోతున్నాయి. ఒకే ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు.. అదీకూడా సొంత సోదరులు కేశినేని నాని, కేశినేని చిన్నీలు.. రెండు వేర్వేరు పార్టీల నుంచి ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో దిగుతున్నారు.

నాని వర్సెస్ చిన్ని!

తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరును ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే విజయవాడ ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని పేరును ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఖరారు చేసేశారు. దీంతో ఈ ఎన్నికల్లో.. విజయవాడ కేంద్రంగా సొంత అన్నదమ్ముల మధ్య పోరు జరగనుంది. ఇక కేశినేని నాని వరుసగా రెండు సార్లు విజయవాడ నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందారు. అయితే రెండోసారి ఎంపీగా కేశినేని నాని గెలుపొందిన తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబుతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. గతంలో బాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో.. ఆయనకు పూల బోకే ఇచ్చేందుకు సైతం నాని నిరాకరించారు. దీంతో ఇక్కడ రగిలిన రచ్చ.. ఎక్కడికో వెళ్లింది. ఆ తర్వాత చాలా పరిణామాలే జరగ్గా.. నాని వర్సెస్ చిన్నిగా నెలకొన్న చిన్నపాటి వివాదం చినికి చినికి గాలివానలా మారిపోయింది.

నాని ఇలా సైకిల్ దిగి..!

విజయవాడ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణులతో సైతం కేశినేని నాని సాధ్యమైనంత దూరంగా ఉండడమే కాకుండా.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నడవడం.. వారు ఏర్పాటు చేసిన సభలకు ఇదే నాని ముఖ్య అతిథిగా హాజరవుతూ వచ్చారు. ఆ క్రమంలో కేశినేని నాని సైకిల్ పార్టీ వీడి.. ఫ్యాన్ పార్టీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది.. ఆఖరికి అదే నిజమైంది కూడా. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం.. ఆఖరికి పార్టీ మారే వరకూ వెళ్లింది. కృష్ణా జిల్లాలోని తిరువూరులో నిర్వహించిన సభకు పార్టీ అధినేత చంద్రబాబు రాగా.. ఆ క్రమంలో ఆ సభ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు కేశినేని నాని వెళ్లారు.. అప్పటికే అక్కడ ఏర్పాట్లను కేశినేని చిన్ని వర్గం పర్యవేక్షిస్తోంది. దీంతో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోంది. దాంతో పార్టీ అగ్రనాయకత్వం వెంటనే రంగంలోకి దిగి.. ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దంటూ కేశినేని నానికి దూతలతో రాయబారం పంపింది. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసి.. వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇక ఆయన కుమార్తె కేశినేని శ్వేత సైతం.. నగర పాలక సంస్థలోని కార్పొరేటర్ పదవితోపాటు టీడీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.

సరైనోడు ఎవరు..?

విజయవాడ పార్లమెంట్ నుంచి ఎవర్ని బరిలోకి దింపాలని వైఎస్ జగన్ రెడ్డి తీవ్ర కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో.. సరిగ్గా టీడీపీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, నాని పార్టీకి దూరమవ్వడంతో వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. కేశినేనితో చర్చలు జరపడం.. మరుసటి రోజే వైసీపీ అధినేత సమక్షంలో కండువా కప్పేసుకున్నారు. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పొట్లూరి వరప్రసాద్‌ను (పీవీపీ) బరిలో దింపింది. అయితే.. నాని ముందు పీవీపీ నిలబడలేపోయారు. ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుండటంతో సరైనోడి కోసం సీఎం జగన్, వైసీపీ పెద్దలు వెతుకుతున్న తరుణంలో నాని వచ్చి పార్టీలో చేరిపోయారు. నాని రాకతో వైసీపీకి ఊపిరిపీల్చుకున్నట్లు అయ్యింది.

గెలుపెవరిదో..!

విజయవాడ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు అటు ప్రతిపక్ష టీడీపీ, ఇటు వైసీపీ అగ్రనాయకత్వం తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ.. పక్కా ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ముచ్చటగా మూడోసారి సైతం విజయవాడ ఎంపీగా గెలవాలని కేశినేని నాని.. తన వంతు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు విజయవాడ ఎంపీగా గెలిచి... తన సత్తా చాటాలని కేశినేని చిన్ని దూకుడు మీద వెళ్తున్నారు. మరి ఈ అన్నదమ్ముల్లో ఎవరిని విజయలక్ష్మీ వరిస్తుందనేది తెలియాలంటే మాత్రం జూన్-04 వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - Mar 22 , 2024 | 05:41 PM