Share News

Arvind Kejriwal Arrest: ఐదు నెలలు.. 10 సమన్లు.. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ముందు ఏం జరిగిందంటే?

ABN , Publish Date - Mar 23 , 2024 | 11:46 AM

కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేయడానికి ముందు లిక్కర్ స్కామ్‌లో 9 సార్లు, ఢిల్లీ జల మండలిలో అవకతవకలపై ఒక సారి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు. రాజకీయ కుట్రలో భాగంగా నోటీసులు జారీ చేశారని, తాను విచారణకు హాజరుకానని చెప్పారు. 142 రోజుల వ్యవధిలో ఈడీ 10 సార్లు సమన్లు జారీ చేసింది.

Arvind Kejriwal Arrest: ఐదు నెలలు.. 10 సమన్లు.. కేజ్రీవాల్ అరెస్ట్‌కు ముందు ఏం జరిగిందంటే?
Arvind Kejriwal Arrest

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనను 6 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. దీంతో ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు ఈరోజు నుంచి ఆయనను విచారించనున్నారు. అయితే కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన ఈడీ అరెస్ట్ చేయడానికి ముందు లిక్కర్ స్కామ్‌లో 9 సార్లు, ఢిల్లీ జల మండలిలో అవకతవకలపై ఒక సారి విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించలేదు. రాజకీయ కుట్రలో భాగంగా నోటీసులు జారీ చేశారని, తాను విచారణకు హాజరుకానని చెప్పారు. 142 రోజుల వ్యవధిలో ఈడీ 10 సార్లు సమన్లు జారీ చేసింది. చివరికి అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ 142 రోజుల వ్యవధిలో ఏం జరిగిందంటే..

Arvinad Kejriwal: బిగ్‌బాస్‌కు స్వాగతం.. కేజ్రీవాల్‌కు సుఖేశ్ దిమ్మతిరిగే లేఖ

అరెస్టైన వారిలో..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26న 8 గంటల విచారణ తర్వాత అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. 2023 అక్టోబర్‌లో ఆప్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్‌ను ED అరెస్టు చేసింది. హవాలా లావాదేవీల ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్‌ను లిక్కర్ స్కామ్‌లో ED విచారించింది.

మొదటి సమన్లు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 2023 నవంబర్ 2వ తేదీన ఈడీ మొదటిసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ED సమన్లు జారీ చేసింది. వీటిని చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేజ్రీవాల్ ‌విచారణకు హాజరుకాలేదు. దీని తర్వాత ఈడీ వరుసగా సమన్లు పంపుతూనే ఉంది. 2023 డిసెంబర్ 21న రెండోసారి, 2024 జనవరి3న మూడోసారి, జనవరి 18న నాలుగోసారి, ఫిబ్రవరి2న ఐదోసారి, ఫిబ్రవరి 19న ఆరోసారి ఈడీ నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 26న ఏడోసారి, మార్చి4న ఎనిమిదోసారి, మార్చి9న తొమ్మిదోసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అలాగే ఢిల్లీ జలమండలి అక్రమాల కేసులో ఒకసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. మొత్తంగా 10 సార్లు ఈడీ సమన్లను కేజ్రీవాల్‌ నిర్లక్ష్యం చేయడం, మరోవైపు అరెస్ట్ మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు చెప్పడంతో ఈడీ అధికారులు మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 11:46 AM