Share News

Sumalata: తేల్చిచెప్పేశారు.. ఎన్నికల్లో పోటీ చేయను.. త్వరలోనే బీజేపీలో చేరుతా

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:32 PM

లోక్‌సభ ఎన్నికల వేళ మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత(MP Sumalatha) నిర్ణయంపై రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. మండ్యలో గురువారం కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.

Sumalata: తేల్చిచెప్పేశారు.. ఎన్నికల్లో పోటీ చేయను.. త్వరలోనే బీజేపీలో చేరుతా

- మండ్య ఎంపీ సుమలత

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల వేళ మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత(MP Sumalatha) నిర్ణయంపై రాజకీయ ఉత్కంఠతకు తెరపడింది. మండ్యలో గురువారం కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని, త్వరలోనే బీజేపీ(BJP)లో చేరుతానని ప్రకటించారు. మండ్య నియోజకవర్గంతో సంబంధాలను దూరం చేసుకోలేనని, ఇది తమ కుటుంబానికి సెంటిమెంట్‌ అన్నారు. ఇక్కడి నుంచే అంబరీశ్‌ రాజకీయాల్లో రాణించారని గుర్తు చేసుకున్నారు. స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచన లేదన్నారు. ఐదేళ్లపాటు ఎంపీగా శాయశక్తులా పనిచేశానని, రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు. స్వతంత్ర ఎంపీగా ఉన్నా రూ.4వేల కోట్ల గ్రాంటు తెచ్చానని పేర్కొన్నారు. బీజేపీ ప్రతి విషయంలోనూ తనను విశ్వాసంలోకి తీసుకుందని, మీ నాయకత్వం కావాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారని అన్నారు. నాయకత్వాన్ని పెంపొందించే గుణం బీజేపీలో ఉందన్నారు. బీజేపీలో చేరడంలో తన స్వార్థం లేదని, లాభం కోసం ప్రయత్నించి ఉంటే మరో నియోజకవర్గాన్ని ఎంచుకుందునని, అలాంటి నిర్ణయం తీసుకుని ఉంటే మండ్యను వదులుకోవాల్సి ఉండేదన్నారు. రాజకీయాలు చేస్తే మండ్యలో మాత్రమే అనే నిర్ణయంతోనే కొనసాగానని అన్నారు.

అంబరీశ్‌ అభిమానులను వదిలి వెళితే మండ్య కోడలు అనిపించుకోవడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ లో చేరాలని కొందరు సూచించారని, మరికొందరు సుమలత అవసరం కాంగ్రెస్ కు లేదని చెప్పారన్నారు. అంబరీశ్‌ ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో వ్యవహరించారని, తనకు గౌరవం లేని కాంగ్రెస్ లోకి వెళ్లాలా... అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బీజేపీ పరోక్షంగా మద్దతు ఇచ్చి అభ్యర్థిని నిలపలేదన్నారు. ప్రస్తుతం బీజేపీ-జేడీఎ్‌సతో పొత్తులో భాగంగా మండ్యను వదులుకున్నానని అన్నారు. చివరిక్షణం దాకా మండ్య కోసం ప్రయత్నించానని, సాధ్యం కాలేదన్నారు. బెంగళూరు ఉత్తర, చిక్కబళ్లాపుర, మైసూరు టిక్కెట్‌ ఇస్తామని సూచించారని, మండ్యను విడిచి ఎక్కడికి వెళ్లదలచుకోలేదని, ఓడినా గెలిచినా చివరకు ప్రాణం పోయినా మండ్యలోనే అంటూ తేల్చి చెప్పారు. సుమలత పోటీ చేసేది లేదని, ప్రత్యేకించి బీజేపీలో చేరతానని ప్రకటించడంతో మండ్య జేడీఎ్‌స-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామికి కొండంత బలం దక్కినట్టయింది. మూడు రోజుల క్రితమే కుమారస్వామి పాత రాజకీయ విభేదాలను వదిలి నేరుగా సుమలత ఇంటికెళ్లి చర్చలు జరిపిన సంగతి విదితమే.

ఇదికూడా చదవండి: PM Modi: 3 రోడ్‌షోలు.. 3 బహిరంగ సభలు.. నాలుగు రోజులపాటు మోదీ ప్రచారం

Updated Date - Apr 04 , 2024 | 01:32 PM