Share News

Sourav Ganguly: ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిసిన సౌరవ్ గంగూలీ..అందుకేనా?

ABN , Publish Date - Jan 03 , 2024 | 06:00 PM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(sourav ganguly) బుధవారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి(vishnu dev sai)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి చర్చించిన గంగూలీ సీఎంను క్రికెట్ విషయంలో సపోర్ట్ చేయాలని కోరినట్లు వెల్లడించారు.

Sourav Ganguly: ఛత్తీస్‌గఢ్ సీఎంను కలిసిన సౌరవ్ గంగూలీ..అందుకేనా?

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(sourav ganguly) ఈరోజు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి(vishnu dev sai)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గంగూలీకి బెల్ మెటల్‌తో తయారు చేసిన రాష్ట్ర జంతువు అటవీ గేదె విగ్రహాన్ని, శాలువాను బహూకరించి స్వాగతం పలికారు. ఇక గంగూలీ తన ఆటోగ్రాఫ్‌తో కూడిన బ్యాట్‌ను గౌరవప్రదంగా ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా క్రికెట్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పలు అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఓపీ చౌదరి, ఎమ్మెల్యే సంపత్ అగర్వాల్, ముఖ్యమంత్రి కార్యదర్శి డాక్టర్ పి.దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అగర్వాల్‌ జగన్నాథ్‌ పూరి నుంచి తీసుకొచ్చిన జగన్నాథుని ప్రసాదాన్ని, ఫొటోను ముఖ్యమంత్రి, గంగూలీలకు అందజేశారు.


ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కేవలం మర్యాదపూర్వక పర్యటనలో భాగంగానే సీఎంను కలిసినట్లు పేర్కొన్నారు. తాను మొదటిసారి ఈ ముఖ్యమంత్రిని కలవడం అని చెప్పారు. అంతేకాదు రంజీ ట్రోఫీకి ఛత్తీస్‌గఢ్(chhattisgarh) కొత్త వేదిక కానున్న నేపథ్యంలో రాష్ట్రం అందుకు సపోర్ట్ చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. ఈ క్రమంలో అతనిని కలవడం సంతోషంగా ఉందని సౌరవ్ గంగూలీ అన్నారు.

చర్చల సందర్భంగా గంగూలీ ముఖ్యమంత్రిని క్రికెట్‌పై ఆసక్తి గురించి అడుగగా.. ఎంతో ఆసక్తి ఉందని చెప్పారు. జష్పూర్ జిల్లా గురించి వివరిస్తూ ఇక్కడ హాకీ ఆడతారని చెప్పారు. ఇక్కడ కొండ కోర్వా తెగ వారు విలువిద్యను చాలా నైపుణ్యంగా అడతారని అన్నారు. ఆ క్రమంలో విలువిద్యపై చాలా ఆసక్తిని కనబరుస్తారని గుర్తు చేశారు. తాను తొలిసారి ఛత్తీస్‌గఢ్‌కు వచ్చానని గంగూలీ తెలిపాడు. ఇక్కడ నవ రాయ్‌పూర్(Raipur) స్టేడియం చాలా బాగుందన్నారు. ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయని, సచిన్ లాంటి ప్రముఖ ఆటగాళ్లు కూడా ఇక్కడ ఆడారని చెప్పుకొచ్చారు. ఛత్తీస్‌గఢ్ గురించి గంగూలీ ముఖ్యమంత్రిని వివరంగా అడిగారు. ఛత్తీస్‌గఢ్‌లో అటవీ సంపద సమృద్ధిగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయని తెలిపారు.

Updated Date - Jan 03 , 2024 | 06:00 PM