Share News

Shirdi: షిర్డీ సాయినాథ్ కు అయోధ్య రాములోరి అహ్వానం

ABN , Publish Date - Jan 12 , 2024 | 09:23 AM

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి షిర్డీ సాయినాథుడిని ఆహ్వానం అందింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ...

Shirdi: షిర్డీ సాయినాథ్ కు అయోధ్య రాములోరి అహ్వానం

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి షిర్డీ సాయినాథుడిని ఆహ్వానం అందింది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొనడానికి జనవరి 22న అయోధ్యకు రావాలంటూ ఇన్విటేషన్ అందినట్లు షిర్డీ దేవస్థానం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున ప్రణవ్ పవార్ షిర్డీ ఆలయాన్ని సందర్శించారు. ఆహ్వాన పత్రికను సాయిబాబా సమాధిపై ఉంచారు. అనంతరం షిర్డీ దేవస్థానం సీఈఓ తుకారాం ముండేకు అందజేశారు. తాజాగా బాబా సంస్థానానికి అధికారిక ఆహ్వాన పత్రం అందడంతో భక్తుల్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఆలయం తరఫున ఎవరు షిర్డీకి వెళ్తారో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

కాగా.. చరిత్రాత్మక వేడుకకు అయోధ్య నగరం ముస్తాబవుతోంది. విశిష్ట అతిథులకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నాయి. పత్రికలపై ఉన్న అక్షరాలను దేవనగరి లిపిలో రాశారు. మొదటి పేజీలో అపూర్వ ఆనందిక్‌ నిమంత్రన్‌.. అంటే తెలుగులో అపూర్వమైన సంతోషకరమైన ఆహ్వానం అని రాసి ఉంది. ఆ వాక్యానికి పైభాగాన మందిర చిత్రాన్ని ముద్రించారు. ఆహ్వాన పత్రికను తెరవగానే రెండో పేజీలో అందమైన బాలరాముడి మనోహరమైన రూపాన్ని చిత్రీకరించారు.

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆనందీ బెన్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ నృత్య గోపాల్‌ దాస్‌ మొదలగువారి పేర్లు ఆహ్వాన పత్రికలో కనిపిస్తాయి. జనవరి 22 న ఉదయం పూజ, మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నట్లు ఆహ్వాన పత్రికలో ఉంది.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 09:23 AM